తణుకులో జగన్ రైతు దీక్ష: పక్కనే లక్ష్మీ పార్వతి
తణుకు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం రైతు దీక్షను ప్రారంభించారు. ఆయన తణుకులో దీక్షకు కూర్చున్నారు. ఆయన పక్కనే లక్ష్మీపార్వతి కూర్చున్నారు. ఈ దీక్షకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు హాజరయ్యారు.
రెండు రోజుల పాటు వైయస్ దీక్షను సాగిస్తారు. ముందుగా ఆయన దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడికి విచ్చేసినవారికి అభివాదం చేసి దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు పార్టీ శాసనసభ్యులు, నేతలు వేదికపై దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు.హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడికి చేరుకున్న వైయస్ జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తణుకు చేరుకున్నారు.
రుణాల మాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 56,900 కోట్ల రూపాయల రుణాలను రైతులకు ఇవ్వాలని ఆయన అన్నారు. బలహీనుల తరఫున జగన్ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కేవలం రూ.3,900 కోట్లు మాత్రమే రుణమాఫీకి ఇచ్చిందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల క్రాప్ ఇన్సూరెన్స్ రావడం లేదని ఆయన అన్నారు. రైతులు, మహిళలు చంద్రబాబును నమ్మి మోసపోయారని ఆయన విమర్శించారు. జగన్ లేకపోతే రుణమాఫీని పూర్తిగానే ఎత్తేసేవాడని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీ సాధ్యం కాదని చంద్రబాబు అన్నారని, జగన్ ప్రశ్నించకపోతే చంద్రబాబు ఈ మాత్రం కూడా చేసేవారు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఉద్యమం సాగిద్దామని ఆయన అన్నారు.
దీక్షా శిబిరం వేదిక నుంచి ఆయన మాట్లాడారు. రైతులు, మహిళల కోసం జగన్ దీక్ష చేస్తున్నట్లు అళ్ల నాని తెలిపారు. చంద్రబాబు చేతులో రైతులు మోసపోయారని ఆయన అన్నారు. వాగ్దానాలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ఎపిలో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.