నరికేయండి!: సోనియాపై జగన్ నిప్పులు, బిజెపి పైనా
న్యూఢిల్లీ: మరో వందేళ్ల వరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో కాళ్లు పెట్టకుండా ఆ పార్టీని నరికి వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరుతో మాట్లాడారు. విభజన తీరును చూస్తుంటే మనం అసలు ప్రజాస్వామ్య భారత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. నియంత అందరికీ హిట్లర్ గుర్తుకు వస్తాడని, ఇప్పుడు ఎపి విభజన చూస్తుంటే మాత్రం సోనియా గుర్తుకు వస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయం అడ్డగోలుదన్నారు. కేవలం పది సెకండ్లలో లోకసభలో బిల్లు ప్రవేశ పెట్టారని, సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. లోకసభ సన్నివేశాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేశారని, అంధకారంలో విభజన చేశారన్నారు. రాజ్యసభలోను బిల్లు పెట్టిన తీరు, చర్చ తీరు సరిగా లేదన్నారు. ఇంత దారుణంగా ఎప్పుడు, ఎక్కడా జరగలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం పది రోజుల్లో రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్నారు.
రాష్ట్రాన్ని విడగొట్టారని, హైదరాబాదును తీసుకుంటున్నారని, తమను వేరేచోటకు వెళ్లమంటున్నారని కానీ, కొత్త రాజధానికి ఎంత డబ్బిస్తారు, ఎక్కడకు వెళ్లాలి, ఎన్నేళ్లు ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. సీమాంధ్ర లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్యాకేజీ గురించి మాట్లాడలేదన్నారు. విభజన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయన్నారు. అసెంబ్లీ వద్దన్న బిల్లును అప్రజాస్వామికంగా పార్లమెంటు ఆమోదించిందన్నారు.
స్పెషల్ ప్యాకేజీ అంటే ఏమిటో చెప్పాలన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం కలిస్తే ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతుందో ఎపి విభజన ద్వారా అర్థమవుతోందన్నారు. టిడిపి ద్వంద్వ వైఖరి అవలంభించిందన్నారు. తెలంగాణ టిడిపి ఎంపిలు బిల్లు బాగుందంటారని, సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకిస్తారని, చంద్రబాబు మాత్రం మాట్లాడరని విమర్శించారు. నాయకత్వం అంటే ఇలాగే ఉంటుందా అన్నారు. కాంగ్రెసు పార్టీతో ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయన్నారు.
భారతీయ జనతా పార్టీ బిల్లు బాగా లేదని, అన్యాయమని చెబుతూనే విడగొట్టేందుకు సహకరించిందన్నారు. విభజనతో ఓ ప్రాంతాన్ని నట్టేట ముంచారన్నారు. ఇలాంటి అన్యాయాన్న పైనుండి దేవుడు చూస్తున్నాడన్నారు. తమ కాళ్లు విరగ్గొట్టినా తాము మళ్లీ పైకి లేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపొంది, తమ వల్లే కేంద్ర ప్రభుత్వం నిలబడేలా చేసి, కేంద్రం మెడలు వంచి సీమాంధ్రకు న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తామన్నారు. తాము రాష్ట్రపతి అపాయింటుమెంటు కోరామన్నారు.
విభజనపై తాము చివరి వరకు పోరాడుతామని, న్యాయస్థానానికి వెళ్తామని చెప్పారు. డివిజన్, ఓటింగ్ లేకుండా బిల్లును ముందుకు నెట్టేశారన్నారు. రాష్ట్రం ఎంపీలు లేకుండా రాష్ట్రం గురించి చర్చించడమేమిటని ప్రశ్నించారు. విభజన తీరు అన్యాయమని సీతారాం ఏచూరి రాజ్యసభ నుండి వాకౌట్ చేశారన్నారు. కాగా, జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నమస్కారం పెట్టి మరీ అందరు కలిసి రావాలని కోరారు.