దేవుడి మాట వినాలి: చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తాను చేపట్టిన దీక్షపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు అనుమానాలు వ్యక్తం చేయడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రం వ్యక్తం చేశారు. తన నుంచి సేకరించిన రక్తనమూనాలను ట్యాంపర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన యూరినల్ శాంపిల్స్ కావాలంటే నేరుగా డాక్టర్లు, మీడియా సమక్షంలో ఇస్తానని, రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారని, ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి వాటికి పాల్పడడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు గాను చంద్రబాుబ దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్నది తన కోసం కాదని ఆయన చెప్పారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, ప్రజలకు మంచి జరుగుతుందని తాను దీక్ష చేస్తుంటే రాజకీయాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తాను రాజకీయాలు చూశాను గానీ ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా చూడలేదని, అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. తమ నాన్న ముందు డాక్టర్ అని, ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని, పులివెందులలో తమ మామ పేరున్న డాక్టర్ అని, ఇప్పటికి ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇక్కడి నుంచి వారు నమూనాలు తీసుకుని వెళ్తున్నారు అక్కడ టాంపర్ చేస్తున్నారని, వైద్య పరీక్షల ఫలితాలు విడుదల చేయడం లేదని, తప్పుడు గ్లూకో మీటర్ తెచ్చి దీక్షపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రభుత్వ వైద్యులు తెచ్చిన గ్లూకో మీటర్ 88 చూపిస్తుంటే, కొత్త గ్లూకో మీటర్ 77 చూపిస్తోందని ఆయన చెప్పారు. వైద్యులు, సూపరింటిండెంట్లు మారాలని ఆయన డిమాండ్ చేశారు మంత్రుల మాట కాదు దేవుడి మాట వినాలని ఆయన అన్నారు.