అడవిలో.. బురదలో నడిచి: ఆ యాత్రలో జగన్ పెద్ద రిస్క్ ఇలా..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం చాపరాయిలో పర్యటించారు. విష జ్వరాలకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం చాపరాయిలో పర్యటించారు. విష జ్వరాలకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
తన పర్యటనతో ఆ ప్రాంత ప్రజలు మనం ఉండే బాహ్య ప్రపంచానికి ఎంత దూరంగా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో జగన్ తెలియజెప్పారని అంటున్నారు.
క్లిష్టమైన మార్గంలో..
జగన్ చాపరాయి పర్యటనలో డ్రైవర్ తన నైపుణ్యంతో ఆయనను అక్కడకు తీసుకు వెళ్లారని, మిగతా వైసిపి నాయకులు వెనుకనే ఉండిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, జగన్ ఎక్కిన వాహనాన్ని తొలుత పార్టీ నేత నడిపారట, ఆ తర్వాత క్లిష్టమైన మార్గంలో డ్రైవర్ తన చేతికి తీసుకున్నాడని అంటున్నారు.
సెక్యూరిటీ లేని వాహనంలో..
మాజీ మంత్రి జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజా తొలుత జగన్ వెళ్తున్న వాహనాన్ని నడిపాడని అంటున్నారు. జగన్ కాన్వాయ్లో ఉపయోగించే కార్లు ఆ రోడ్లపై నడవవు. దీంతో పోర్ వీల్ డ్రైవ్ ఉన్ వాహనాలను సమకూర్చారు. అయితే, సెక్యూరిటీ లేని వాహనాలకు పోలీసులు తొలుత నో చెప్పినప్పటికీ.. ఆ తర్వాత వైసిపి నేతలు పట్టుబట్టడంతో ఓకే చెప్పారట. ఆ తర్వాత జగన్ ఫోర్ వీల్ వాహనంలో చాపరాయి వెళ్లారు.
వాహనంలో.. నడిచి..
మారేడుపల్లి నుంచి చాపరాయి బయలుదేరారు. ఈ రోడ్డు దాదాపు యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కచ్చా రోడ్డు. అరణ్యంలా ఉంటుంది. జగన్ కూర్చోగా.. జక్కంపూడి ఈ కారును డ్రైవ్ చేస్తూ వెళ్లారంటున్నారు. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు మరింత దారుణంగా ఉంటుంది. దీంతో జక్కంపూడి తప్పుకొని, అసలు డ్రైవర్ తన చేతిలోకి తీసుకున్నాడట. ఆ తర్వాత కొంత దూరం పూర్తిగా నడిచారు. ఆ తర్వాత కొందరు నాయకులు, సెక్యూరిటీ మాత్రమే చాపరాయి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఆయన కలుసుకున్నారు.
అడవిలో.. బురదలో..
కాగా, జగన్ శనివారం చాపరాయిలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. చాపరాయి చేరుకునేందుకు జగన్ దట్టమైన అడవిలో వెళ్లారు. బురద, రాళ్లు, రప్పలు అనకుండా ముందుకు కదిలారు. అనంతరం ఆ గ్రామానికి చేరుకున్నారు.