పెన్షన్ల తొలగింపుపై నోరు విప్పిన జగన్-కేబినెట్లో ఫుల్ క్లారిటీ-ఇక మంత్రులకు చుక్కలే.. !
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడిన సంక్షేమ పథకాల్లో సామాజిక పింఛన్లు కూడా ఒకటి. గత టీడీపీ ప్రభుత్వంలో 2 వేలుగా ఉన్న పింఛన్ మొత్తాన్ని మూడు వేలకు పెంచుతానంటూ జగన్ ఇచ్చిన హామీ ఓటర్లకు టానిక్ లా పనిచేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసారి మాత్రమే పింఛన్లను పెంచిన ప్రభుత్వం.. మరోసారి పెంచేందుకు నిధుల కొరతతో అల్లాడుతోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల తొలగింపు కార్యక్రమం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. దీంతో పింఛన్లపై తొలిసారి సీఎం జగన్ నోరు విప్పారు.
వైఎస్సార్ ఆసరా పింఛన్లు
ఏపీలో మాజీ సీఎం వైఎస్ హయాంలో సామాజిక పింఛన్ల పథకానికి భారీగా ఆదరణ దక్కింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు సామాజిక పింఛన్లకు పేర్లు మార్చినా అమలు మాత్రం ఆగలేదు. దీంతో ప్రభుత్వాలకు పించన్లు సంక్షేమ అజెండాగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఎక్కడైనా ఒకటీ అరా ఇబ్బందులున్నా భారీ ఎత్తున పింఛన్ల తొలగింపు ప్రయత్నాలు మాత్రం జరగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్న పింఛన్ల కంటే ఎక్కువ మంది లబ్దిదారులకు పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. వైఎస్సార్ ఆసరా పేరుతో ఇస్తున్న ఈ పింఛన్లను రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా వాటికి గ్రహణం పట్టడం మొదలైంది. దీంతో పించన్ల వ్యవహారం పదే పదే చర్చకు వస్తోంది.
పెరగని పింఛన్ మొత్తాలు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఇచ్చిన హామీల్లో ఒకటి పింఛన్ల మొత్తం 3వేలకు పెంపు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3 వేలు పెరుగుతుందని అంతా భావించారు. కానీ మూడు వేలకు పింఛన్లు పెంచుకుంటూ పోతా అంటూ జగన్ తాను చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. దీంతో జనానికి నిరాశే మిగిలింది. తొలి ఏడాది మాత్రం రూ.250 పింఛన్ పెంచిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత ఏడాది నుంచి పెంపును విస్మరించింది. అసెంబ్లీలో విపక్షాలు గగ్గోలు పెట్టినా, సభా హక్కుల పేరుతో వారి నోరు మూయించేశారు. చివరికి ఒత్తిడితో ఈ ఏడాది పెంచుతామంటూ చెప్పారు. కానీ లబ్దిదారులు ఎదురుచూస్తున్నా వైసీపీ సర్కార్ మాత్రం పింఛన్ల పెంపు గురించి మాత్రం ఇప్పటికీ మాట్లాడటం లేదు. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది.
పింఛన్లలో జోరుగా కోతలు
వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చినట్లుగా పింఛన్ల మొత్తాలు పెరగకపోగా వాటిలో కోతలు కూడా మొదలైపోయాయి. ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఉంటే ఒకరికి కట్, రేషన్ కార్డు ఇద్దరికి ఉంటే ఒకరికి పింఛన్ కట్, కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంటే పింఛన్ కట్.. ఇలా కోతల పర్వం జోరుగా సాగుతోంది. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. మంత్రుల ఇలాకాల్లోనూ పింఛన్ల కోతలు జోరుగా సాగుతుండటంతో వారు సమాధానం చెప్పుకోలేని పరిస్ధితులు తలెత్తుతున్నాయి. దీనిపై సీఎం కార్యాలానికి, పౌరసరఫరాల శాఖకూ విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. విపక్షాల విమర్శలు సరేసరి. దీంతో ప్రభుత్వానికి పింఛన్ల కోతలపై ఏం చేయాలో తెలియని పరిస్దితి.
జగన్ కు మొరపెట్టుకున్న మంత్రులు
రాష్ట్రంలో ఆసరా పింఛన్లలో భారీగా విధిస్తున్న కోతలపై వైసీపీ మంత్రులు నిన్నటి కేబినెట్ భేటీలో సీఎం జగన్ కు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు పింఛన్లలో విధిస్తున్న కోతల వల్ల నియోజకవర్గాల్లో స్ధానికంగా ఎదురవుతున్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. పింఛన్ల సమస్యను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు తప్పేలా లేవని వారు భావిస్తున్నారు. దీంతో పింఛన్ల సమస్యపై సీఎం జగన్ నుంచి వారు క్లారిటీ కోరారు. దీనిపై జగన్ కూడా తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చేశారు.
కోతలపై జగన్ క్లారిటీ
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పింఛన్ల కోతలపై మంత్రుల మొర విన్న జగన్ వారికి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పింఛన్ల కోతలపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పేశారు. అనర్హులైన లబ్దిదారులకు మాత్రమే పింఛన్ల కోతలు పడుతున్నాయని, వాటిపై మంత్రులు కాదు ఎవరు చెప్పినా వెనక్కి తగ్గే పరిస్ధితి లేదన్నారు. అదే విషయాన్ని ప్రజల్లోకి సైతం తీసుకెళ్లాలని సీఎం జగన్ మంత్రులకు తేల్చిచెప్పేశారు. విపక్షాలు పింఛన్లపై విమర్శలు చేస్తున్నప్పుడు వాటికి పూర్తి సమాచారంతో కౌంటర్లు కూడా ఇవ్వాలని మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు. అనర్హులకు పించన్లు ఇవ్వాలని పట్టుబట్ట వద్దని కూడా సూచించారు. దీంతో మంత్రులు ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
Recommended Video
మంత్రులకు ముందునుయ్యి వెనుక గొయ్యి ?
కేబినెట్ భేటీలో పింఛన్ల తొలగింపుపై సీఎం జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేయడంతో మంత్రులకు ఇదో భారీ షాక్ గా మారబోతోంది. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటనల సందర్భంగా పింఛన్లు ఎప్పుడు పెంచుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. నేతల నుంచి కూడా ఈ మేరకు మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కోతలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కూడా కోతలు తప్పవని తేల్చి చెప్పేయడంతో పాటు అనర్హుల్ని సిఫార్సు చేయవద్దంటూ సూచించడం మంత్రుల పరిస్ధితి మరింత దారుణంగా మార్చేసింది. ఇప్పుడు నియోజకవర్గాల్లో నేతలకు సర్ది చెప్పుకోలేక, అలాగని కోతలు విధిస్తుంటే వచ్చే విమర్శల్ని భరించలేక మంత్రుల పరిస్ధితి ముందునుయ్యి, వెనుక గొయ్యిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.