'టచ్లో నేతలు, పాదయాత్రలో జనం లేకపోవడంతో నేతలకు జగన్ క్లాస్!'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాహుబలి అని, ప్రధాని నరేంద్ర మోడీ భల్లాల దేవుడు అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మంగళవారం అన్నారు. చంద్రబాబుపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తిప్పి కొడతామన్నారు. తమ డిమాండ్లు, ఆందోళనలపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఏపీ ప్రజలు భారత దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు కృష్ణా జిల్లాలో ఆదరణ లేదన్నారు. జనం లేకపోవడంతో నేతలకు జగన్ క్లాస్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోందన్నారు.
టీడీపీ నేతలు కొందరు తమతో టచ్లో ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. టీడీపీలో చేరేందుకే చాలామంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మునిగిపోయే నావ వైసీపీ అని, అలాంటి పార్టీలో ఎవరు ఉంటారని ప్రశ్నించారు.
డబ్బుకు ఆశపడి వారు వైసీపీలో చేరారు, త్వరలో వారి భరతం పడతాం: ధర్మాన
జగన్పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో రోజూ వ్యవసాయం గురించి మాట్లాడుతున్న జగన్కు అసలు వ్యవసాయం స్పెల్లింగే తెలియదన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆక్వా, సెరీకల్చర్, హార్టికల్చర్ రంగాల్లో ప్రగతి సాధించామన్నారు.
వ్యవసాయ రంగంలో 17.76 శాతం వృద్ధి సాధించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే రైతులను ఆదుకుంటామన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ బడ్జెట్ను రూ.13074 కోట్ల నుంచి రూ.19570 కోట్లకు పెంచామని, 2017-18లో అభివృద్ధి రేటును 17.76శాతం సాధించామని చెప్పారు. బిందు సేద్యంలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉందన్నారు.
ప్రతిపక్ష వైసీపీ కంటే బీజేపీయే తమను ఎక్కువగా విమర్శిస్తోందని మండిపడ్డారు. వైసీపీ, బీజేపీలు ఏం చేయలేవన్నారు. విదేశాల్లో బ్లాక్ మనీని తెస్తామని చెప్పిన మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నోటా కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఏపీలోను అలాగే ఉంటుందన్నారు.