క్రికెట్ లో కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు, ప్లీజ్ ఫోకస్: అధికారులకు బూస్ట్ ఇచ్చేలా జగన్ కామెంట్స్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివిధ కార్యక్రమాల, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశనం చేయడంతో పాటుగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనలో దాదాపు 20 నెలలు ముగిసిందని, మూడో వంతు సమయం గడిచిపోయిందని పేర్కొన్న సీఎం జగన్ ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ లో మిడిల్ ఓవర్లలో ఉన్నామని ఆసక్తికరంగా మాట్లాడారు.
మంచి టీమ్ ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా
సహజంగా ఈ సమయంలో బ్రేక్ తీసుకోవాలి అనుకుంటారు కానీ ఇప్పుడు రిలాక్స్ అయితే వెనుకబడి పోతామని, మళ్లీ అందరూ ఫోకస్ పెట్టాల్సిన సమయం ఇదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్రికెట్లో కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదని పేర్కొన్నారు సీఎం, మొత్తం టీం సమిష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. తనకు మంచి టీమ్ ఉందని, ఇలాంటి టీమ్ ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అధికారులను ఉద్దేశించి సీఎం జగన్ పేర్కొన్నారు.
గత 20 నెలలుగా అందరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది
గత 20 నెలలుగా అందరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది అన్న జగన్ లక్ష్య సాధన కోసం కలిసికట్టుగా పని చేయాలన్నారు. అప్పుడే మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయడం కోసం అందరి సహాయ సహకారాలు కావాలని పేర్కొన్న జగన్, ఇప్పటి వరకు ప్రతి అధికారి తమ అంచనాలకు మించి అంకితభావంతో పని చేశారని కితాబిచ్చారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న గొప్ప అధికారులు ఉన్నందుకు రాష్ట్ర ప్రజలంతా గర్విస్తున్నానని జగన్ స్పష్టం చేశారు.
సుపరిపాలన అందించటంలో అధికారులందరికీ అనుభవం
వివిధ శాఖల మధ్య సమన్వయంతో పని చేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని, పనులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ఒకవేళ లోపాలుంటే సవరించుకోవాలి అని సీఎం జగన్ సూచించారు. అధికారంలోకి వచ్చిన ఇరవై నెలలలోపే అన్నింటినీ సాధించి చూపించామని, సుపరిపాలన అందించటంలో అధికారులు అందరికీ అనుభవం ఉందని, ఇంకా మంచి పాలన అందుతుందని భావిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మంచి ఆలోచన అయితే నిబద్దతతో అమలు చేద్దాం
రాష్ట్రంలో పాలన మరింత మెరుగు పరచడం కోసం అధికారుల అభిప్రాయాలు , సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. మంచి ఆలోచన అయితే నిబద్ధతతో అమలు చేస్తామని స్పష్టం చేశారు.అప్పుడే సత్ఫలితాలు వస్తాయని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర పాలనలో కీలకంగా పని చేస్తున్న అధికార యంత్రాంగానికి సీఎం జగన్ తన వ్యాఖ్యలతో మరింత బూస్ట్ ఇచ్చారు.