బలి తీసుకుంటారా: శేషాచలం ఎన్కౌంటర్పై జగన్
హైదరాబాద్: అమాయకులై కూలీలను బలిగొనడం దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలు ఎన్కౌంటర్లో హతం కావడంపై ట్విట్టర్లో స్పందించారు. తుపాకులు లేని 20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. నిరాయుధులైన కూలీలను అన్యాయంగా బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన మంచి పాలన కోసం ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని ప్రజాస్వామ్య పోరాటం చేస్తామని గురువారం లోటస్పాండ్ పార్టీ ఆఫీసులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్తానం 12వ వార్షికోత్సవంలో ప్రకటించారు.
వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచక పాలనకు తెరదించేందుకు ప్రజాప్రస్తానాన్ని వైఎస్ ప్రారంభించారని గుర్తు చేశారు.
యూజర్ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన రోజుల్లో వైఎస్ ఈ యాత్ర చేపట్టారన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్కు దక్కుతుందన్నారు. 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి దేశంలో ఎవరూ చేయలేని విధంగా ప్రజారంజక విధానాలను అమలు చేశారన్నారు.
ప్రజలు ఇప్పటికీ వైఎస్ పాలనను స్వర్ణయుగంగా భావిస్తారన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పేదలకు ఉన్నత చదువులు అందించారన్నారు. ఆరోగ్య శ్రీ ప్రవేశపెట్టి ఎందరికో ప్రాణదానం చేశారని జగన్ చెప్పారు.