పీకే సర్వే మేరకే టిక్కెట్లు, తేల్చేసిన జగన్, ఆ ఇద్దరికే గ్రీన్ సిగ్నల్.. మరి మిగిలినవారి పరిస్థితి?
Recommended Video
నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో జగన్ తమకే టిక్కెట్ ఇస్తారని ఎంతో ఆశపెట్టుకుని ఉన్న జిల్లా నేతల్లో చాలామంది ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో కొట్టిమిట్టాడుతున్నారు. నెల్లూరు నగరం, సూళ్లూరుపేట స్థానాలకు తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా అభ్యర్థిత్వాలపై జగన్ నోరు మెదపలేదు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారంమే ఎవరికైనా టిక్కెట్లు అని గతంలో ప్రకటించిన వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి వారికి మద్దతు పలకాలని సూచించడంపై పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది.
‘పీకే' ఓకే అంటేనే ఎవరికైనా...
వైసీపీలో ప్రశాంత్ కిషోర్ హవా నడుస్తోందని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే మేరకే అభ్యర్థులు టిక్కెట్లు ఇస్తానంటూ ఇటీవల గుంటూరులో జరిగిన వైసీపీ సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించడంతో పీకే బృందానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే ఈ బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ప్రాథమికంగా కొంత సమాచారాన్ని జగన్కు అందించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో పాదయాత్ర.. 18వ రోజుకు...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో నిర్విరామంగా సాగుతోంది. సోమవారం నాటికి ఈ యాత్ర 18వ రోజుకు చేరుకుంది. సూళ్లూరుపేట నుంచి మొదలై గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయి ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల్లో జగన్ ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టనున్నారు.
పాదయాత్ర బాధ్యతంతా వారిదే...
జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతం చేసేలా ముందుగానే ప్రతి జిల్లాలో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదే అవకాశంగా జగన్ దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. మరోవైపు వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జుల బలాబలాలు, బలహీనతలు అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకు చేరవేస్తున్నారు.
ఆ ఇద్దరికి టిక్కెట్ కన్ఫర్మ్...
తన పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి జిల్లా నేతల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. నాయుడిపేటలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరును ప్రస్తావించారు. ఈసారి కూడా ఆయనకు మద్దతు పలకాలని కోరారు. దీంతో ఇదే తరహాలో జగన్ అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఎక్కడా, ఎవరికీ జగన్ టిక్కెట్ కన్ఫర్మ్ చేయలేదు. ఆర్యవైశ్యులతో జరిగిన సమావేశంలో నెల్లూరు సిటీ నుంచి ఈసారి అనిల్ కుమార్ పోటీ చేస్తారని, పార్టీ అధికారంలోకి వస్తే.. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్కు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని మాత్రమే చెప్పి జగన్ వెళ్లిపోయారు.
నేతల్లో తీవ్ర ఆందోళన...
నెల్లూరు జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జగన్ పాదయాత్ర, సభలు జరిగాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు సంజీవయ్య, అనిల్ కుమార్ పేర్లు మాత్రమే ప్రస్తావించి వారికే ఈసారి టిక్కెట్ కన్ఫర్మ్ చేయడంపై పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది. నిజానికి జగన్ బహిరంగ సభల్లో స్థానిక నేతల పేర్లు ప్రస్తావిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో ఆయా నేతలకు కాస్త పట్టు పెరుగుతుంది. కానీ అలా చేయకుండా, ఎవరి పేరు ప్రకటించకుండా ఏకపక్షంగా ప్రసంగాలు చేసుకుంటూ జగన్ వెళ్లిపోతుండడంతో ఈసారి పార్టీ టిక్కెట్ లభిస్తుందో లేదో అనే ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది.
కావలి ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా...
ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ తనదేనని వైఎస్ జగన్ చేత ఒక ప్రకటన చేయించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఎన్నో విధాల ప్రయత్నించారు. కానీ ఆయనా పేరును కూడా జగన్ ప్రకటించలేదు. ప్రతాప్ కుమార్రెడ్డి టీడీపీలో చేరతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి వర్గంతో విభేదాలు, అయినా ఈసారి టిక్కెట్ తనకేనని ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి, ఎంపీ మేకపాటిల చేత ప్రకటన చేయించిన ప్రతాప్ పాదయాత్ర సందర్భంగా పార్టీ అధినేతచేత కూడా ఓకే చెప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. అయినా జగన్ నోట ప్రతాప్ పేరే రాలేదు. మరోవైపు జగన్ మరో నాలుగురోజుల్లో నెల్లూరు జిల్లాలో తన పాదయాత్ర ముగించుకుని ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు.