ఓ వైపు హోదా ఉద్రిక్తత, మరోవైపు అమరావతి వేడుక: జగన్ వర్సెస్ టిడిపి
గుంటూరు/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు ఉద్వేగం, ఉద్రిక్తత, మరోవైపు వేడుకలకు సన్నద్ధం కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఇంకోవైపు, రాజధాని శంకుస్థాపన వేడుకకు అమరావతి సిద్ధమవుతోంది.
జగన్ దీక్ష పైన అధికార పార్టీ మండిపడుతుండగా, జగన్ దీక్షను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. జగన్కు ఏం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని వైసిపి సహా విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. జగన్ దీక్షను విరమింప చేసే బాధ్యత ప్రభుత్వాల పైనే ఉందని చెబుతున్నాయి.
జగన్ ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో... తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి హుటాహుటిన దీక్ష చేస్తున్న నల్లపాడుకు వచ్చారు. ఆయనను పరామర్శించారు. మరికొందరు నేతలు.. జగన్ను దీక్ష విరమించాలని కోరుతున్నారు. మరో రూపంలో ఉద్యమిద్దామని చెబుతున్నారు.
జగన్ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నారని వైసిపి నేతలు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించక పోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. అలాగే జగన్ దీక్ష పైన మంత్రులు, టిడిపి నేతల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు, అధికార పార్టీ నేతలు జగన్ దీక్ష పైన భగ్గుమంటున్నారు. ప్రత్యేక హోదా కంటే మంచి ప్యాకేజీకి కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రంలో ఓ వైపు పండుగ జరుగుతోంటే దీక్ష విడ్డూరమని మండిపడ్డారు. మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... జగన్ దీక్ష పైన అనుమానాలున్నాయన్నారు.
సోమిరెడ్డి నిప్పులు
జగన్ దీక్ష పైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ దీక్షకు సొంత ఎమ్మెల్యేల నుంచే మద్దతు లేదన్నారు. హోదా పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆయన ఢిల్లీలో దీక్ష చేయవలసింది పోయి.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. జగన్కు హోదా విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారన్నారు.
రాజధాని రైతుల సమస్యలపై మంత్రుల సమీక్ష
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతుల సమస్యల పైన మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సమీక్ష నిర్వహించారు. రైతులు లేవనెత్తిన సమస్యల పైన వారు చర్చించారు. రేషన్ కార్డులు, భూసమస్యలు, పింఛన్ల పైన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వారు చర్చించారు.