'రోజాను తీసుకెళ్లండి, జగన్ నోట మానవత్వమా': 'భూమా సరే.. శోభ మాటేమిటి', జగన్ మైక్ కట్
మొగల్తూరు అక్వా పార్క్ ప్రమాదంపై ఏపీ శాసన సభలో శుక్రవారం చర్చ జరిగిన సమయంలో సభలో ఇరు పక్షాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. జగన్, అచ్చెన్నాయుడు మధ్య వాగ్యుద్ధం కనిపించింది.
అమరావతి: మొగల్తూరు అక్వా పార్క్ ప్రమాదంపై ఏపీ శాసన సభలో శుక్రవారం చర్చ జరిగిన సమయంలో సభలో ఇరు పక్షాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. జగన్, అచ్చెన్నాయుడు మధ్య వాగ్యుద్ధం కనిపించింది. ఆ తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది.
అంతకుముందు..
అవసరమైతే జగన్, తాను కలిసి అక్వా ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని పరిశీలిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఓ సమయంలో మరో మంత్రి అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకున్నారు.
అక్వా ఫుడ్ పార్క్ వద్దకు జగన్, అచ్చెన్నాయుడు వెళ్తామని చెబుతున్నారని, వారికి తాను ఓ సూచన చేస్తున్నానని, ఎమ్మెల్యే రోజాను కూడా తీసుకు వెళ్తే బాగుంటుందని అయ్యన్నపాత్రుడు చెప్పారు.
ఆ తర్వాత, అచ్చెన్నాయుడు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటే చంద్రబాబుకు ఎనలేని ప్రేమ అని చెప్పారు. దానిపై జగన్ కౌంటర్ ఇచ్చారు. అంత ప్రేమ ఉంటే మంత్రి లేదా ముఖ్యమంత్రి నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో లేదన్నారు. అచ్చెన్న గోదావరి జిల్లా ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.
మానవత్వం గురించి జగన్ మాట్లాడటమా..
జగన్ మానవత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా కనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోతే కనీసం సంతాపం తెలిపేందుకు సభకు రాలేదన్నారు. అలాంటి జగన్ మానవత్వం గురించి మాట్లాడటమా అన్నారు. మా గురించి విమర్సలు చేయడం సరికాదన్నారు. జగన్ కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు. జగన్కు మానవత్వం లేదన్నారు.
భూమాపై ప్రేమ సరే.. శోభమ్మ మాటేమిటి
అచ్చెన్నాయుడుకు జగన్ కౌంటర్ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి గురించి అధికార పార్టీ ప్రేమ ఒలకబోస్తోందని, మరీ 30 ఏళ్లు మీ పార్టీకి ఊడిగం చేసిన శోభా నాగిరెడ్డి చనిపోతే మీరు ఎందుకు రాలేదని జగన్ ప్రశఅనించారు. ఏం మాట్లాడుతున్నావు నీవు (అచ్చెన్నాయుడు), రాజకీయం చేయాలనుకుంటే దేనినైనా చేయవచ్చునని అన్నారు.
వీరికి శిక్షణ ఇవ్వాలి.. చంద్రబాబు
వైసిపి మొదటిసారి వచ్చిందని, ఇలాంటి వారికి శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. సభలో హుందాతనం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చిందన్నారు. శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సభలో హద్దు దాటిన వారికి కఠిన నిబంధనలు ఉండాలన్నారు. రెడ్ లైన్ పెట్టి, ఆ మార్క్ దాటిన వారిని సస్పెండ్ చేయాలన్నారు.
దానికి జగన్ మాట్లాడుతూ.. అవుట్ డేటెడ్ ఎమ్మెల్యేలు ఎవరో తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రేమ ఉందని చెప్పే టిడిపి సభ్యులు 37 మంది పైన కేసు ఎందుకు పెట్టిందో చెప్పాలన్నారు. పైప్ లైన్ల కోసం రూ. కోట్లు ఖర్చు పెట్టే బదులు, ఫ్యాక్టరీ సముద్ర తీరంలో నిర్మిస్తే బాగుంటుందన్నారు.
జగన్ మైక్ కట్
వైసిపి అధినేత జగన్ మాట్లాడుతుండగా మైక్ కట్ అయింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. తమ అధినేతకు మాట్లాడే అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు.