బాబు ఇక్కడ ఏడుస్తాడు, మోడీ తల్చుకుంటే ఒక్క నిమిషం, హైదరాబాద్ వెళ్లాక..: జగన్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు. మంత్రులు, బిజెపి నేతలు జగన్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.
జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత మూడు బడ్జెట్లు జరిగాయన్నారు. చంద్రబాబు తరుచూ ఢిల్లీకి వెళ్లి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. హోదా సాధిస్తామని ప్రతి సభలో హామీ ఇస్తారని, కానీ చేసిందేం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలలో ఒక్కదానినైనా సంతృప్తి కలిగేలా చంద్రబాబు తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు కోట్లు ఖర్చు పెడతారని ఆరోపించారు. పోలవరం తొలి దశ అంటే మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రాజధానిపై ఫోటోలు చూపించి రెండేళ్లు కాలం గడిపేశారన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకు రాలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ఇక్కడ బీద ఏడుపు ఏడిచి, ఢిల్లీలో గొప్పలకు పోతారని ఎద్దేవా చేశారు. విభజన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలన్నారు. నేను మోడీ కంటే బాగా చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారన్నారు.
చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలన.. సింగపూర్ వెళ్లానని, అమెరికా వెళ్లానని చెప్పడం తప్ప ఏం చేసింది లేదన్నారు. సమైక్య పాలనలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారని, ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఏపీకి కేంద్రం నుంచి ఏం తీసుకు రాలేదన్నారు.
రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ హామీ ఏమయిందన్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు సమైక్య ఏపీలో ఏం అభివృద్ధి చేశారని జగన్ ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి: పల్లె
తొమ్మిదిన్నరేళ్ల గత పాలనలో చంద్రబాబు ఏం అభివృద్ది చేశారన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు.
జగన్! నీవు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టు
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ప్రపంచమంతా తిరిగి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కష్టపడుతున్నారన్నారు. వైసిపి సహకరించకపోయినప్పటికీ మేం అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తామన్నారు. నీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. నీ వద్ద లక్ష కోట్లు ఉన్నాయని, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నారు.
చంద్రబాబుతో వైయస్ రాజశేఖర రెడ్డికి పోలిక లేదన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు 24 గంటలు పని చేస్తున్నారన్నారు. ఇంత కష్టపడుతున్నా అభివృద్ధి చెందకపోవడానికి వైయస్ హయాంలో దోపిడీయే కారణమని అభిప్రాయపడ్డారు.
ఏపీ అభివృద్ధి బాబు వల్లే సాధ్యమని ప్రజలు తమకు అవకాశమిచ్చారన్నారు. ఈ రోజు అధికారంలో మేముంటాం, రేపు వేరే వారు ఉంటారని, కానీ భావి తరాల కోసం వైసిపి అభివృద్ధిలో కలిసి రావాలన్నారు.
బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... చంద్రబాబు భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసి నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకు వస్తే సంతోషించవలసింది పోయి విమర్శించడం విడ్డూరమని అన్నారు.
జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేశామన్నారు. ఢిల్లీలోను దీక్ష చేశామన్నారు. యువభేరి పేరితో ప్రతి జిల్లా తిరుగుతున్నామన్నారు. ప్రత్యేక హోదా పైన ఒక్కోసారి ఓ రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
హోదా కోసం గతంలో చట్టంలో పెట్టలేదని చెప్పడం సరికాదన్నారు. ఎన్నిసార్లు చట్టంలో మార్పులు చేయడం లేదన్నారు. తెలంగాణలోను ఏడు మండలాలను ఏపీలోకి తెచ్చేందుకు మార్పు చేయలేదా అని ప్రశ్నించారు. పలు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉందన్నారు.
మోడీ తలుచుకుంటే ఒక్క నిమిషంలో..
ప్రధాని మోడీ తలుచుకుంటే ఒక్క సంతకంతో ప్రత్యేక హోదా వస్తుందన్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. కొత్త రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు అరవై శాతం కెపాసిటీతోనే నడుస్తున్నాయన్నారు. చంద్రబాబు ఏదో చేస్తారని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
హైదరాబాద్ మన నుంచి వెళ్లిపోయాక ఒక్క ఐటీ కంపెనీ కూడా ఏపీకి రాలేదన్నారు. పైగా కొన్ని పరిశ్రమలు మూతబడుతున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రెండుసార్లు కరువు వచ్చిందని, వరదలు కూడా వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరం మనకు లేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారన్నారు.