అడుగడుగునా స్పందన.. 600 కిలోమీటర్లు దాటి సాగుతున్న జగన్ పాదయాత్ర!
అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'ప్రజా సంకల్ప పాదయాత్ర' 600 కిలోమీటర్లు దాటి కొనసాగుతోంది. మంగళవారానికి పాదయాత్ర 44వ రోజుకు చేరుకుంది.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని గాండ్లపెంట వద్ద జగన్ మంగళవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు బండారుచెట్టు పల్లి వరకూ జగన్ పాదయాత్ర సాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కడప జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర ఆరు వందల కిలోమీటర్ల దూరాన్నిపూర్తి చేసుకుని సాగుతోంది. కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఆరువందల కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది.
కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పాదయాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే, ఇక్కడ గత ఎన్నికల్లో వైకాపానే విజయం సాధించింది. అయితే.. గెలిచిన అత్తార్ చాంద్ భాషా తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు.
ఈ నేపథ్యంలో కదిరి నియోజకవర్గంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు తగ్గట్టుగా ప్రజల నుంచి కూడా స్పందన బాగా ఉండటంతో వైకాపా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్రకు కదిరి నియోజకవర్గమే చివరిది. సాయంత్రం ఐదు గంటలకు జగన్ బండారుచెట్టు పల్లికి చేరుకుంటారని వైకాపా పేర్కొంది. అనంతరం ఈ నియోజకవర్గం దాటేసి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు జగన్ మోహన్ రెడ్డి.