జగన్ - ఎన్ శ్రీనివాసన్ల కుట్ర, వారికి తెలియకుండా పెట్టుబడి: సిబిఐ
హైదరాబాద్: ఇండియా సిమెంట్స్ బోర్డు తీర్మానం చేయక ముందు నుంచే జగన్ కంపెనీల్లోకి ఎన్ శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారని సిబిఐ గురువారం హైకోర్టుకు తెలిపింది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా నీకిది - నాకది పద్ధతిలో ముడుపుల రూపంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
భారతి సిమెంట్సులో వాటాలను ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఫ్రెంచి కంపెనీకి విక్రయించారని పేర్కొంది. ఇండియా సిమెంట్స్ ఎండీగా, డైరెక్టర్గా శ్రీనివాసన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వెల్లడించింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో మూడో నిందితుడిగా ఉన్న శ్రీనివాసన్ తన పేరును కేసు నుంచి తప్పించాలని, విచారణ పూర్తయ్యే దాకా అభియోగాల నమోదు నిలిపివేయాలని, హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు విచారణ చేపట్టారు. సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తూ 2008 జనవరి 16న బోర్డు తీర్మానం బోర్డు తీర్మానించిందని, దీనికి ముందు 2007 ఫిబ్రవరి నుంచే రూ.5 కోట్ల చొప్పున శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారని పేర్కొన్నారు.
కంపెనీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు మళ్లించారని, ఇలా రూ.140 కోట్ల పెట్టుబడులకు ఎలాంటి డివిడెండ్లు పొందలేదని తెలిపారు. విడతల వారీగా పెట్టుబడులు పెట్టారన్నారు. జగన్, శ్రీనివాసన్ కుట్రలో భాగంగానే వ్యవహారాలు జరిగాయన్నారు.