సిబిఐ కోర్టుకు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు బదిలీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాల ఆధారంగా ఎ.కె.దండమూడి, టీ.ఆర్. కన్నన్, మాధవ్ రామచంద్రన్ తదితరులు జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
జగన్ అక్రమస్తులపై నమోదైన కేసు విచారణ సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ప్రజా ధనం దుర్వినియోగంపై ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. అయితే, ఈ కేసుల్లో ఈడీ విచారణను నిలిపివేసి, వాటిని కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుండగా దానికి సమాంతరంగా అవే అభియోగాలపై ఈడీ నమోదు చేసిన కేసు మరోకోర్టులో విచారణ చేయడం సరికాదని కోర్టుకు విజయసాయి వివరించారు. ఈడీ నమోదు చేసిన కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని, లేని పక్షంలో సీబీఐ కోర్టులో విచారణలో ఉన్న కేసు తేలేంతవరకు దానిని నిలుపుదల చేయాలని కోరారు.
ఈ విషయాన్నే సీబీఐ కోర్టుకు తెలిపామని, సీబీఐ కోర్టు అందుకు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈడీ కేసులు విచారించే పరిధిని సీబీఐ ప్రత్యేక కోర్టుకు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఉత్తర్వులను పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది పి.ఎస్.పి.సురేష్ కుమార్ తెలిపారు. అయితే సీబీఐ నమోదు చేసిన కేసులతోపాటే ఈడీ కేసులను కూడా విచారించేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్టి జస్టిస్ రాజా ఇళంగో.. ఈడీ కేసుల విచారణను కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేశారు. సీబీఐ కేసులతో ఈడీ కేసులు కూడా ప్రత్యేక కోర్టులో విచారించేలా ఆదేశించాలన్న ఈడీ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆ కేసుల విచారణపై సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.