జగన్ అక్రమాస్తుల కేసు: టన్నుఅంటే కోట్లు, పెన్డ్రైవ్ రట్టుకు ఆధారం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో ఆధారాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్కు హవాలా రూపంలో సొమ్ము అందిన అంశానికి సంబంధించిన ఆధారాల్ని సీబీఐ కోర్టుకు సమర్పించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఈ ఆధారాలను చేర్చి విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. 2010 మే నుంచి 2011 జూన్ మధ్యకాలంలో దాల్మియా నుంచి జగన్కు రూ.కోట్ల ముడుపులు అందాయని సీబీఐ గతంలో ఛార్జీషీటు దాఖలు చేసింది.
ఈ క్రమంలో దాల్మియా సిమెంట్స్కు చెందిన జోయ్ దీప్ బసు అనే వ్యక్తి నుంచి ఓ పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకొని చూడగా.. '3500 టన్నుల స్టాక్ అందింది.. ఇంకో 500 టన్నులు పంపండి' అని పేర్కొంటూ ఆడిటర్ విజయ సాయి రెడ్డి పంపిన ఈ మెయిల్ కనిపించింది.
అయితే, ఆ సమయంలో సిమెంటు లావాదేవీలు జరగలేదని, హవాలా నగదుకు సాయి రెడ్డి పెట్టిన కోడ్ టన్నులు అని సీబీఐ ఛార్జీషీటులో పేర్కొంది. సీబీఐ ఆరోపణలను జగన్ న్యాయవాదులు తోసిపుచ్చారు.
దీంతో ఈ కేసును మరింత క్షుణ్ణంగా విచారించిన సీబీఐ ఆ సమయంలో సిమెంటు కానీ, రా మెటిరీయల్ కానీ దాల్మియా నుంచి విజయ సాయి రెడ్డికి వెళ్లలేదని, కేంద్ర కమర్షియల్ ట్యాక్స్ వర్గాల నుంచి ఆధారాలు తీసుకొచ్చి కోర్టుకు సమర్పించింది. వీటిని నమ్మదగిన ఆధారాలుగా కోర్టు పరిగణించి విచారణకు స్వీకరించింది.
కొద్ది రోజుల క్రితం.. జగన్ కేసు దర్యాప్తులో భాగంగా దాల్మియా సిమెంట్ కార్యాలయం, దాని ఉద్యోగుల నివాసాల్లో సోదాలు జరిపి ఐటీ స్వాధీనం చేసుకున్న పెన్డ్రైవ్ గుట్టు రట్టు చేయడానికి సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ ఇప్పుడు కోర్టుకు సమర్పించింది.
పెన్డ్రైవ్లో 'జెఆర్' (జగన్మోహన్ రెడ్డి) ఖాతాకు రూ.55 కోట్ల చెల్లింపులకు సంబంధించిన అంశంపై సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు, దాల్మియా ఉద్యోగులు మరికొందరి నుంచి వాంగ్మూలాలను సేకరించిన సీబీఐ వాటిని కోర్టుకు అందించింది. ఈ పత్రాలను దాల్మియా వ్యవహారంలో దాఖలు చేసిన అభియోగ పత్రానికి జత చేయాలని కోరింది.
కాగా, 3500 టన్నులంటే రూ.35 కోట్లని తెలిపింది. దీన్నిబట్టి పునీత్ దాల్మియా నుంచి వచ్చే సొమ్ము చెల్లింపులకు సంబంధించి జగన్, సాయిరెడ్డిలు పర్యవేక్షిస్తూ వచ్చారని సీబీఐ తెలిపింది.ఈ విషయాన్ని అభియోగ పత్రంలో పేర్కొన్నప్పటికీ ఈ-మెయిల్ సమాచారంలో వాస్తవంపై సీబీఐ ఇన్స్పెక్టర్ విజయ్భాస్కర్ దర్యాప్తు కొనసాగించారు.
ఇందులో భాగంగా ఆధారాలను సేకరించడంతోపాటు 11 మంది సాక్షులను విచారించి, ఏడుగురి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇందులో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు, కడప జిల్లాకు చెందిన గనుల శాఖ అధికారులున్నారు.
దాల్మియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎఫ్అండ్ఎ) నుంచి తీసుకున్న సమాచారంతో సీబీఐ నివేదిక రూపొందించింది. 2009 నుంచి 2010 వరకు ఉన్న 4 డిస్పాచ్ రిజిస్టర్లను, రోజువారీ సరకు నిల్వల వివరాల రిజిస్టర్, ప్లాంట్ నుంచి వివిధ ఖాతాదారులకు వెళ్లిన స్టాక్ వివరాలను పరిశీలించింది.