తండ్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి లండన్ నుంచి వచ్చిన కుమార్తె!
కడప: ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి, 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, తన తండ్రి సాధించిన అపూర్వ విజయాన్ని ఆస్వాదించడానికి లండన్ నుంచి వచ్చారు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె వర్షా రెడ్డి. నాలుగురోజుల కిందటే ఆమె లండన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. అక్కడి నుంచి తన తల్లి భారతి, మేనత్త షర్మిళ, సోదరి హర్షారెడ్డితో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.
వైఎస్ జగన్ కుమార్తెలు వర్షారెడ్డి, హర్షా రెడ్డి సోమవారం నాడే తాడేపల్లి నివాసానికి వచ్చారు. అద్భుత విజయాన్ని సాధించిన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు కాబోయే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించనున్నారు.
వైఎస్ జగన్, భారతి దంపతుల పెద్ద కుమార్తె వర్షా రెడ్డి. ప్రస్తుతం లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజులకే వైఎస్ జగన్ దంపతులు లండన్కు వెళ్లి, కుమార్తెను కలిసి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండురోజుల తరువాత ఆమె హైదరాబాద్కు బయలుదేరి వచ్చారు.
ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భార్య భారతి, కుమార్తెలతో పాటు దివంగత మాజీ మంత్రి, చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు హాజరు కానున్నారు. వారితో పాటు పులివెందుల నుంచి వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు.