'భౌతికంగా నిర్మూలించాలనే, జగన్ తెలంగాణ పోలీసులకు ఓకే చెప్పలేదు'
హైదరాబాద్: స్వార్థ రాజకీయాల్లో భాగంగానే తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం ఆరోపించారు. దర్యాఫ్తు పారదర్శకంగా ఉండాలంటే స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ విచారణ జరపాలన్నారు. జగన్ పైన జరిగిన అమానవీయ హత్యాయత్నం చూసి తెలుగు వాళ్లంతా నిర్ఘాంతపోయారన్నారు. జరుగుతున్న పరిణామాల పట్ల కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.
ఆపరేషన్ గరుడలో చెప్పినట్లే, ప్రభుత్వాన్ని కూల్చాలనే: గవర్నర్పై బాబు తీవ్ర విమర్శలు
జగన్ పైన దాడి ఘటనపై డీజీపీ, తెలుగుదేశం పార్టీ నేతల తీరును ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ సహా పలువురిని కలుస్తామని చెప్పారు. జగన్ తన గాయాన్ని, నొప్పి భరించి కూడా ప్రజల కోసం పాదయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, నేతలం, కార్యకర్తలం మాత్రం విశ్రాంతి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
జగన్ను భౌతికంగా నిర్మూలించాలనే కుట్ర
జగన్ను భౌతికంగా నిర్మూలించాలనే కుట్ర వెనుక, జరిగినటువంటి, జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్లాలని తాము నిర్ణయం తీసుకున్నామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ హత్యాయత్నం చేశారన్నారు.
జగన్ తెలంగాణ పోలీసులకు ఓకే చెప్పలేదు
పార్థసారథి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ దర్యాఫ్తును మాత్రమే తాము వ్యతిరేకించామని, తెలంగాణ పోలీసుల దర్యాఫ్తు కోరుకోలేదని చెప్పారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము ఏదో ఏపీ పోలీసులను వ్యతిరేకించి, తెలంగాణ పోలీసుల దర్యాఫ్తును స్వాగతిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, అవి సరికాదన్నారు. ఎల్లో మీడియా వార్తలను ఖండిస్తున్నామని, ఏపీ పోలీసులను అవమానించినట్లుగా జగన్ మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని, అది సరికాదన్నారు. తాము స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ విచారణ కోరుకున్నామన్నారు.
చంద్రబాబే అలా, లోకేష్ మరోలా ఉంటారా?
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఈ రోజు ట్విట్టర్లో పలు ట్వీట్లు చేశారని, అందులో అభ్యంతరకర పదాలు వాడారన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, చంద్రబాబే నిన్న ప్రెస్ మీట్లో అభ్యంతరకరంగా, అసభ్యకరంగా మాట్లాడారని, ఇక ఆయన కొడుకు లోకేష్ బాగా మాట్లాడుతారని అనుకోవడం పొరపాటు అన్నారు. ఏపీ రాష్ట్ర అధికారులను, వ్యవస్థలను కించపరుస్తున్నటువంటి జగన్కు ప్రజలే బుద్ధి చెబుతారని లోకేష్ చెప్పారని, కానీ మంత్రిగా ఆయనే బెదిరిస్తున్నారన్నారు.
సానుభూతి కోసం కాదు
డీజీపీ తీరుపై తాము స్పష్టంగా నిన్ననే చెప్పామని అంబటి రాంబాబు అన్నారు. కోడి కత్తి డ్రామా అంటూ, మోడీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ లోకేష్ మాట్లాడటం విడ్డూరమన్నారు. ఏపీలోని అన్ని విచారణలను చంద్రబాబు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము ఈ ఏజెన్సీలను కోరుకోవడం లేదని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సానుభూతి కోసం తాము దాడులు చేయించుకోమన్నారు.
ముద్దాయిని కాపాడే ప్రయత్నం, లోకేష్ జ్ఞానం అందరికీ తెలుసు
ముద్దాయిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఇందులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లుగా తమకు అనుమానం కలుగుతోందని అన్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే జగన్ సీఎం కావాలని ప్రయత్నాలు చేశారని లోకేష్ ట్వీట్ చేశారని, కానీ వైయస్ చనిపోయినప్పటి నుంచి జగన్ ఎలా కష్టపడుతున్నారో, ఎలా ప్రజల్లో తిరుగుతున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. వైయస్ తర్వాత జగన్ పట్టు వదలకుండా ప్రజల కోసం తిరుగుతున్నారని, ప్రపంచంలోనే ఎవరు తిరగనట్లుగా 3వేల కిలోమీటర్లు తిరిగారన్నారు. సిగ్గులేకుండా మాట్లాడవద్దన్నారు. స్కిట్ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని, నీ జ్ఞానం ఎంతటిదో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. స్కిట్ చేతిలో ఉందని మాట్లాడితే నిన్ను, మీ నాన్నను ప్రజలు ఇంటికి పంపిస్తారన్నారు.
మాపై బురద జల్లేందుకే ఢిల్లీ టూర్
తమ పార్టీ పైన, తమ పార్టీ అధినేత పైన బురద జల్లేందుకే చంద్రబాబు ఢిల్లీకి పర్యటనకు వెళ్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. జగన్పై బురద జల్లి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు చంద్రబాబు ఎంత నీచమైన స్థితికి అయినా దిగజారుతారన్నారు. జగన్ కోసం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కాచి, వడపోశారని, అలాగే ఢిల్లీ పర్యటనను తమపై కుట్ర కోసం వాడుకుంటారని చెప్పారు. ఈ ఘటనపై ప్రజలకు చెప్పాలని నిర్ణయించామని చెప్పారు.