నిమ్స్ నుంచి జనగ్ డిశ్చార్జీ: మూడు రోజులు విశ్రాంతి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ శనివారం ఉదయం హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈ సమయంలో ఆయనను చూసేందుకు పెద్ద యెత్తున అభిమానులు ఆస్పత్రి చెంతకు చేరుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ సతీమణి వైయస్ భారతి, పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులకు నిమ్స్కు వచ్చారు.
కీటోన్స్ మినహా చక్కెర స్థాయితో పాటు మిగతావన్నీ సాధారణ స్థాయికి వచ్చినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో ఆయనను వైద్యులు డిశ్చార్జీ చేశారు. కీటోన్స్ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని, అందువల్ల జగన్ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ హైదరాబాదులోని తన నివాసం లోటస్ పాండు వద్ద ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ నిరాహార దీక్షలో ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను ఈ నెల 9వ తేదీ అర్థరాత్రి బలవంతంగా నిమ్స్కు తరలించారు.
నిమ్స్లో కూడా ఆయన దీక్షను కొనసాగించడానికి ప్రయత్నించారు. అయితే, వైద్యులు బలవంతంగా ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో ఆయన దీక్ష భగ్నమైంది. సమైక్యాంధ్ర డిమాండ్తో ఆయన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.