చంద్రబాబులా జగన్ దొంగ పని చేయలేదు, కాలం తిరిగొస్తుంది: అంబటి
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబులా వైయస్ జగన్ ఆయన కుటుంబం దొంగ పనులు చేయలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు సోమవారం విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న నిరవధిక దీక్షను దొంగ దీక్ష అని చంద్రబాబు, మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
దొంగ లెక్కలు, మోసపూరిత హామీలు చంద్రబాబువేనని ఎద్దేవా చేశారు. చిత్తుశుద్దితో దీక్ష చేస్తున్న జగన్ పైన ఆరోపణలు సరికాదన్నారు. మంత్రులు, టిడిపి నేతలు అలాంటి ప్రకటనలు మానేయకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. అసలు రక్త నమూనాలు ఎప్పుడు తీసుకుంటున్నారో, ఎప్పుడు పరీక్షలు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరికరాలు లేక ప్రయివేటు పరీక్ష కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారంటే ప్రభుత్వం పనికిరాని పాలన అర్థమౌతోందన్నారు.
ఆరు రోజులుగా నిద్రాహారాలు మానుకొని జగన్ దీక్ష చేస్తుంటే టిడిపి నేతలు, మంత్రులకు కనిపించడం లేదా అని నిలదీశారు. జగన్ దీక్షను మెచ్చుకోకపోయినా ఫరవాలేదని, ఆరోపణలు మాత్రం చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
మంత్రులు, చంద్రబాబు అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. కాలం తిరిగి వచ్చి, వారిని అధపాతాళంలోకి నెట్టి వేసే రోజు త్వరలో వస్తుందన్నారు. ప్యాకేజీల గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారన్నారు.
దాని గురించి మాట్లాడకపోయినా కేంద్రం ఇస్తుందని, హోదా పైన మాత్రం స్పందించాల్నారు. కుట్ర చేసి రాష్ట్రాన్ని విడదీసి, ప్రత్యేక హోదా ఇస్తామని నాడు కేంద్రమే చెప్పిందని, అందుకు టిడిపి కూడా మద్దతు పలికిందన్నారు. ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నించడం విడ్డూరమన్నారు.