రోజా టు రిషికేశ్వరి: బాబుపై జగన్ ఆగ్రహం, బాలకృష్ణనూ లాగారు
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో మహిళా దినోత్సవం రోజున వైసిపి అధినేత జగన్, మంత్రులు రావెల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడు తదితరుల మాధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు మాట్లాడాక... జగన్ మాట్లాడారు.
నా సోదరి రోజాను సభ నుంచి సస్పెండ్ చేసిన ఘన చరిత్ర ఈ ప్రభుత్వానిది అన్నారు. వనజాక్షిని జుత్తు ఓ టిడిపి ఎమ్మెల్యే పట్టుకున్నారని, అలాంటి వారి పైన కేసులు లేవని, అరెస్టులు లేవని జగన్ అన్నారు. రిషికేశ్వరి చనిపోతే ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు.
జగన్ రిషికేశ్వరి గురించి మాట్లాడగా.. మంత్రి గంటా శ్రీనివాస్ రావు స్పందించారు. రిషికేశ్వరి ఘటనలో బాబురావును అరెస్టు చేశామని, సభలో అబద్దాలు సరికాదన్నారు.
జగన్ మాట్లాడుతూ... కాల్ మనీ సెక్స్ రాకెట్ ఘటనను ప్రస్తావించారు. చంద్రబాబుతో కలిసి నిందితులు ఉన్నారని, అయినప్పటికీ నిందితులను జైలుకు పంపలేదని, కొందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ధ్వజమెత్తారు. అంగన్ వాడి మహిళలపై దాడి చేసిన కేసు పెట్టలేదన్నారు. కాల్ మనీ అరాచకం అధికార పార్టీ నేతలదే అన్నారు. ఇదేనా మహిళలపై చూపిస్తున్న ప్రేమ అన్నారు.
జగన్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ... ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. జగన్ అన్నీ పాత విషయాలే ప్రస్తావిస్తున్నారని, కొత్త విషయాలు ఏం ప్రస్తావించడం లేదన్నారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.
జగన్ మాట్లాడుతూ.. తాను జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతుంటే తన పైన ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. మీరు చేసే అన్యాయాలను ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి తిట్టిస్తారని ధ్వజమెత్తారు. ఓ శాసన సభ్యుడి మాటలు నేషనల్ మీడియాలో సెన్షేషనల్ అవుతున్నాయని జగన్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి అన్నారు.
రావెల కొడుకును ప్రస్తావించిన జగన్
ఓ వ్యక్తి మహిళను కారులోకి లాక్కొని, బలాత్కారం చేయబోతే ఆ వ్యక్తి నాన్న దాని గురించి ఏం మాట్లాడారని జగన్ ప్రశ్నించారు.
రావెల మాట్లాడుతూ.. మహిళల హక్కులకు, స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ టిడిపిది అన్నారు. నా కుమారుడు తప్పు చేసి ఉంటే ఏ శిక్ష వేసినా తాను సిద్ధమని చెప్పానని చెప్పారు. తన కొడుకుపై ఆరోపణలు చేసిన యువతి తనకు కూతురులాంటిది అని చెప్పానన్నారు.
తన కొడుకైనా, ఇంకెవరైనా ఆ యువతి పట్ల అలాంటి చర్యకు పాల్పడితే ఏ శిక్ష విధించేందుకైనా సిద్ధమన్నారు. తన కొడుకును తానే స్వయంగా పోలీస్ స్టేషన్లో అప్పగించానని చెప్పారు. తప్పు చేశాడా లేదా విచారించాలని తాను పిఎస్లో అప్పగించానని చెప్పారు.
జగన్.. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు అని ఆరోపించారు. ఆ సమయంలో వైయస్ మాట్లాడుతూ.. తన కొడుకు అమాయకుడని, కేసులో ఇరికించవద్దని చెప్పారని గుర్తు చేశారు. కేసు నుంచి జగన్ పేరును తొలగించేలా చేశారన్నారు.
నేను మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డిలా తన కొడుకును తప్పించాలని ప్రయత్నాలు చేయలేదన్నారు. నేను విచారణకు సిద్ధమన్నారు. పరిటాల రవి కేసులో తప్పించుకోవడానికి ప్రయత్నించిన హీనచరిత్ర వైయస్ రాజశేఖర రెడ్డిది అన్నారు.
జగన్ మాట్లాడుతూ... తన కొడుకు ఇంత దారుణమైన తప్పు చేస్తే దానికి కూడా జగన్ పైన ఆరోపణలు చేస్తే, ఇలాంటి మంత్రిని ఇంకా చంద్రబాబు కొనసాగిస్తున్నారంటే దానికి మనం తల వంచుకోవాలన్నారు.