అఖిలకే కాంట్రాక్ట్, చేతులు జోడిస్తున్నా: బాలకృష్ణని లాగిన జగన్, పార్లమెంటుకో జిల్లా
నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లీంలు గుర్తుకు వచ్చారని వైసిపి అధినేత జగన్ గురువారం మండిపడ్డారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లీంలు గుర్తుకు వచ్చారని వైసిపి అధినేత జగన్ గురువారం మండిపడ్డారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు దుమ్ముదులిపిన జగన్, అఖిలప్రియపై ఆగ్రహం
బాలకృష్ణను లాగిన జగన్
హిందూపురం నుంచి అప్పుడు అబ్దుల్ ఘనీ ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ ఆ సీటు గుంజుకొని చంద్రబాబు తన బావమరిది బాలకృష్ణకు గత ఎన్నికల్లో ఇచ్చుకున్నారని జగన్ చెప్పారు. ఇప్పుడు అబ్దుల్ ఘనీ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారన్నారు. ఇది ముస్లీంలపై చంద్రబాబుకు ఉన్న అభిమానం అన్నారు.
ఫరూక్ని అడిగితే చెప్తారు
లాల్ జాన్ భాషా కుటుంబానికి చంద్రబాబు ఏం న్యాయం చేశారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కేబినెట్లో ఒక్క ముస్లీం కూడా మంత్రిగా లేరన్నారు. చంద్రబాబుకు ముస్లీంలపై ఎంత ప్రేమ ఉందో ఫరూక్ను అడిగితే చెప్తారన్నారు. నంద్యాల ఉప ఎన్నిక వరకు ఫరూక్కు అపాయింటుమెంట్ లేదన్నారు. ఇప్పుడు మాత్రం ఫరూక్ గుర్తుకు వచ్చారన్నారు. ఎక్కడ వైయస్ పాలన, ఎక్కడ ఈ దిక్కుమాలిన చంద్రబాబు పాలన అన్నారు.
తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారూ..
చంద్రబాబు గారూ! మీరు తప్పు చేస్తున్నారని జగన్ అన్నారు. మీరు వేసిన రోడ్ల పైనే నిలబడి, మీరు పెట్టిన వీధి దీపాల ముందే నిలబడి నిలదీస్తామని జగన్ అన్నారు. ఇచ్చే డబ్బులు ఏమైనా మీ అత్తగారి సొత్తా అని ప్రశ్నించారు. నాగిరెడ్డిలా పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చనిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారని భూమా నాగిరెడ్డి బావమరిది అన్నారని మండిపడ్డారు.
అఖిలప్రియకే కాంట్రాక్టు, కేశవ రెడ్డి పెద్ద స్కాం
ఇక్కడ ఇప్పుడు రోడ్లు వెడల్పు చేస్తున్నారని, ఆ కాంట్రాక్టు అఖిలప్రియదే అని జగన్ ఆరోపించారు. రోడ్లు వెడల్పు కావాలని అందరూ కోరుకుంటారని, కానీ ప్రజలను ఒప్పించాలన్నారు. కేశవ రెడ్డి పెద్ద స్కాం అని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు, కేశవ రెడ్డి బాధితులకు తాను ఒకటే చెబుతున్నానని, మనం అధికారంలోకి రాగానే ఆ డబ్బులు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు చొక్కా, ఆదినారాయణ రెడ్డి నిక్కరు ఎలా విప్పించాలో తమకు తెలుసునన్నారు.ము స్లీంలపై శిల్పా మోహన్ రెడ్డి కేసులు పెడుతున్నారని టిడిపి నేతలు విమర్శించారు. దీనిపై అంతకుముందు శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను వారికి ప్రాధాన్యత ఇచ్చానని, కానీ టిడిపి ఆరోపించినట్లు ఏ చిన్న గాయమైనట్లు ముస్లీంలు భావించినా తాను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు.
నంద్యాలను జిల్లా హెడ్ క్వార్టర్గా
మేం అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పారు. నంద్యాలను జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తామన్నారు. అలా చేస్తే ఇక్కడే కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం వస్తుందన్నారు.
పులి.. సింహం అంటారు
శిల్పా చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనకు పంపించమని ఇచ్చారన్నారు. ఇది సింహం, పులి రాజకీయం అన్నారు. కానీ చంద్రబాబులా రాజకీయం చేయమని చెప్పారు. ఇలాంటి రాజకీయాన్ని హతమార్చేందుకు మీరంతా ముందుకు రావాలన్నారు. ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని, తాను అందరికీ చేతులు జోడించి చెబుతున్నానని అన్నారు.