వైయస్ ఉంటే రాష్ట్రం విడిపోయేదా, నన్ను అబద్దమాడమన్నారు, 30 ఏళ్లు సీఎంగా నా ఆశ: జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం ఎన్నుకున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వైసిపి ప్లీనరీ రెండో రోజు కొనసాగింది.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం ఎన్నుకున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వైసిపి ప్లీనరీ రెండో రోజు కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జగన్ ఎన్నికైనట్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆయనను నేతలు అభినందించారు.
జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)
అనంతరం ఆయన ప్రసంగించారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు అన్నారు. ఆరేళ్లుగా తన పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు.
బాబు గుండెలో రైళ్లు, వైయస్ బతికుంటే విభజన జరిగేదా
ఇక్కడి ప్లీనరీని, కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని జగన్ అన్నారు. చంద్రబాబు పాలన మీద ఇక్కడి నుంచి సమర శంఖం మోగుతోందన్నారు. వైయస్ బతికి ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోయేదా అని ప్రతి గుండె అడుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు, వృద్ధులు, అక్కాచెల్లెళ్లు బాధతో ఉండేవారా అని ప్రశ్నించారు. వైయస్ ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాడని, అందుకే ఆయన ప్రతి గుండెలో ఉన్నారన్నారు.
ఈ చిన్న తేడా చాలు.. బాబు, వైయస్ వ్యక్తిత్వం గురించి చెప్పేందుకు
చంద్రబాబు 1995లో సీఎంగా మొట్టమొదటిసారి అధికారంలోకి తీసుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడన్నారు. వైయస్ మాత్రం 2004లో ప్రజల ఆశీర్వాదంతో అధికారం తెచ్చుకున్నాడన్నారు. లాక్కోవడంలో మోసం, ప్రజలు ఆశీర్వదిస్తే తీసుకోవడంలో బాధ్యత ఉంటుందన్నారు. ఈ చిన్న తేడా చాలు.. ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేందుకు అన్నారు. ఎవరికి మైక్ ఇచ్చినా, ప్రజలను ఎవరిని అడిగనా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, చంద్రబాబు అబద్దాలు చెప్పాడని, మోసం చేశాడని అంటారన్నారు.
Recommended Video
మీకు వెన్నుపోటు కష్టమా
కూతురును ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచినోడికి 5 కోట్ల మంది ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడవటం లెక్కనా అని జగన్ ప్రశ్నించారు. భస్మాసరుడు తనకు వరం ఇచ్చిన శివుడి నెత్తినే చెయ్యి పెట్టబోయాడని, ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రజల నెత్తిన అలాగే చెయ్యి పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు పాలన మోసం, దగా అన్నారు.
నన్ను అబద్దాలు ఆడమన్నారు
చంద్రబాబు అబద్దాలు ఆడి, మోసం చేసి అధికారంలోకి వచ్చారని జగన్ అన్నారు. చంద్రబాబులా అబద్దాలు ఆడాలని, మోసపు మాటలు మాట్లాడాలని తన పార్టీ తరఫున పోటీ చేసిన పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు తన వద్దకు వచ్చి చెప్పారని, కానీ అలా చెప్పి వచ్చే అధికారం తనకు వద్దని చెప్పానని అన్నారు.
ముప్పై ఏళ్లుగా సీఎంగా చేసి.. నా ఆశ ఇదీ
ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేయాలనేది తన కోరిక అని జగన్ అన్నారు. తాను చనిపోయిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలనేది తన ఆశ అని చెప్పారు. తనకు ప్రజలకు మంచి చేయాలని ఉందన్నారు. ఎంతలా అంటే.. ఆ మంచి చూసి చనిపోయిన తర్వాత కూడా తనను ప్రజలు గుర్తుకు పెట్టుకోవాలన్నారు. ఇలాంటి ఆశ తనకు ఉంది కాబట్టే మీరు నన్ను గౌరవిస్తున్నారన్నారు. లేక చంద్రబాబులా అబద్దాలు ఆడితే నన్ను మీరు గౌరవించేవారా అని ప్రశ్నించారు.
హీరోనే నచ్చుతాడు.. రియల్ హీరో చావబాదుతాడు
సినిమాలో 14 రీళ్లు ఉంటాయని, చివరి రీల్ తప్ప అన్ని రీళ్లలో హీరో దెబ్బతింటారని, ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయని జగన్ చెప్పారు. కానీ మనకు ఆ హీరోనే నచ్చుతాడని చెప్పారు. చివరి రీల్లో మాత్రం హీరో నెగ్గుతాడన్నారు. దేవుడు ఆశీర్వదించినట్లుగా, ప్రజలు అనుగ్రహించినట్లుగా అప్పుడు కనిపిస్తుందన్నారు. క్లైమాక్సులో రియల్ హీరో విలన్ను చావబాదుతాడన్నారు. ఏ కథ చూసినా, ఏ పురాణం చూసినా ఇంతే అన్నారు. అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మం అన్నారు.
చంద్రబాబు చట్టం ముందు నిలబెడతా
దేవుడి భూముల నుంచి విశాఖ భూకుంభకోం వరకు చంద్రబాబు పాలనలో అంతా అవినీతే అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో అవినీతిలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని రిపోర్టులు ఉన్నాయన్నారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని, ఏ సామాజిక వర్గానికి, ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి న్యాయం జరగలేదన్నారు. అందరూ అన్యాయానికి గురయ్యారన్నారు. కాపులకు, మాదిగలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రాగల కాలం మనదే అన్నారు. అధికారంలోకి వచ్చాక చట్టం ముందు చంద్రబాబును నిలబెడతానని హామీ ఇస్తున్నానని జగన్ అన్నారు. తాను అధికారంలోకి వచ్చాక ఏం చేస్తానో ఇప్పుడే మీ ముందు ఉంచుతానని చెప్పారు.