'జగన్ ఫ్యామిలీని అడిగినా బాబు పేరే చెప్తారు, తెలంగాణ కంటే ఏపీనే'
హైదరాబాద్: ఐటీకి ఆద్యుడే చంద్రబాబు అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిషలు కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు ఐటీకి ఆద్యుడు అనే విషయం జగన్ కుటుంబాన్ని అడిగినా చెబుతారని పల్లె ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఐటీ అంశాన్ని ప్రస్తావించారు. ఐటీని తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు కంటే, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఐటీ అభివృద్ధి ఎక్కువ ఉందని జగన్ చెప్పారు. అవసరమైతే సెల్ఫోన్లు తానే కనిపెట్టానని చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో 85వేల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, వైయస్ హయాంలో 2 లక్షల మంది ఉన్నారని చెప్పారు. దీనిపై టిడిపి ఘాటుగా స్పందించింది.
కంప్యూటర్లు కూడు పెడతాయా అని వైయస్ రాజశేఖర రెడ్డి ఓ సమయంలో అపహాస్యం చేశారన్నారు. ఐటీకి శ్రీకారం చుట్టింది ఎవరు అని వైసిపి అధినేత జగన్ కుటుంబంలో అడిగినా చంద్రబాబు పేరే చెబుతారన్నారు. జగన్ కుటుంబానికి బాంబులు, ఆయుధాల గురించి తెలుసునని ఎద్దేవా చేశారు.
తాను చైనా, జపాన్, సింగూపూర్, అమెరికా ఇలా ఎన్నో దేశాలు తిరిగానని చెప్పారు. ప్రపంచం అంతటా చంద్రబాబు ఐటీ పరిజ్ఞానం గురించి తెలుసునని చెప్పారు. కానీ జగన్కు మాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణల కంటే మైనార్టీలకు ఎక్కువ నిధులు కేటాయించింది తమ ప్రభుత్వమే అన్నారు.
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... ఐటీకి పునాదులు వేసిందే చంద్రబాబు అన్నారు. ఐటీ రంగం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశముందని, చంద్రబాబు హైదరాబాదును ఐటీ రంగంలో ముందంజలో నిలిపారన్నారు. హైదరాబాద్ ఐటీ రంగంలో ఈ స్థాయిలో ఉందంటే దానికి చంద్రబాబు కారణమన్నారు.
హైదరాబాద్, చుట్టు పరిసరాల్లో ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చి, వేలాది కుటుంబాలకు ఉపాధి ఏర్పడిందన్నారు. దీనికి చంద్రబాబు కారణమని చెప్పారు. చంద్రబాబు హయాం కంటే వైయస్ హయాంలో ఐటీలో ఆదాయం ఎక్కువ వచ్చిందని జగన్ చెబుతున్నారని, కానీ చంద్రబాబు విత్తు నాటితే, వైయస్ ఫలం అనుభవించారన్నారు.
హైదరాబాదుకు ఐటీ రంగంలో ప్రాముఖ్యత రావడానికి చంద్రబాబు కారణమన్నారు. వైయస్ హయాంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. చంద్రబాబు పైన విమర్శలు చేసే ముందు ప్రతిపక్ష వైసిపి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
మంత్రి పల్లె మాట్లాడుతూ.. జగన్కు హఠాత్తుగా ముస్లీం మైనార్టీల పైన ఎందుకు ప్రేమ పుట్టుకు వచ్చిందో తెలియదన్నారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మైనార్టీలకు ఏ ఏడాది ఎంత కేటాయించారో పల్లె లెక్కలు చెప్పారు.