జగన్ పిటిషన్: ద్వారంపూడి బంధువులపై ఐటి దాడులు
హైదరాబాద్/ కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14 నుంచి ఎన్నికల ప్రచారం చేసే, సభల్లో పాల్గొనే వివరాలు తెలుపుతూ ఆయన మెమో దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెబుతూ అందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆయన కోరినట్లు సమాచారం. సీమాంధ్రలో ఆయన విస్తృతంగా పర్యటించాలని అనుకుంటున్నారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి బంధువుల ఆస్తులపై ఆదాయం పన్ను శాఖ (ఐటి) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కాకినాడలోని సెవన్స్టార్, శ్రావణి ఆస్పత్రుల యజమానుల ఇళ్లల్లో, ఆస్పత్రుల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇదివరకే ద్వారంపూడిని సిబిఐ అధికారులు విచారించిన నేపథ్యంలో వారి బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకంది. ఇటీవలే జగన్కు సంబంధించి ఆస్తులను కొంత మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన విషయం తెలిసిందే.