చంద్రబాబు తీరుకు విస్తుపోయా, అహంకారం కళ్లకు కట్టింది: జగన్ ఆగ్రహం
Recommended Video
అమరావతి/రాజమహేంద్రవరం: తమకు కనీస వేతనాలు కల్పించాలంటూ నిరసన తెలిపిన క్షురకుల(నాయీ బ్రాహ్మణులు)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తమాషాలు చేస్తున్నారా?: క్షురకులపై ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు, సమ్మె విరమణ
సోమవారం సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన క్షురకులకు కనీస వేతనం ఇవ్వడం కుదరదని, జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని తేల్చి చెప్పారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించడంతో తమాషాలు చేస్తున్నారా? అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే.
బాబు తీరును చూసి విస్తుపోయా
‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న(సోమవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను' అని జగన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
బాబులో అహంకారం, నియంత స్వభావం
అంతేగాక, ‘తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని చంద్రబాబు బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి' అని జగన్ దుయ్యబట్టారు.
చంద్రబాబు స్పందించాల్సి తీరిదేనా?
‘చంద్రబాబుకి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అది సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం' అని వైయస్ జగన్ అన్నారు.
మన ప్రభుత్వం వస్తే..: జగన్
‘దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతి దేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం' అని నాయీ బ్రాహ్మణ వర్గానికి వైయస్ జగన్ హామీ ఇచ్చారు.