రౌడీ రాజ్యం! జేసీ బ్రదర్స్కి చంద్రబాబు ప్రోత్సాహం: తాడిపత్రి ఘటనపై జగన్, భక్తులకు భరోసా
Recommended Video
అమరావతి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ భేటీలో అనంతపురం జిల్లా టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఆశ్రమం మూసివేతకు జేసీ పట్టు, కొందరి వల్ల చెడ్డపేరు.. పోలీసుల ఇష్టం!: బాబు ఆగ్రహం
రౌడీ రాజ్యం కొనసాగుతోంది..
ఇది ఇలా ఉండగా, రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమ వర్గీయులు, చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రమానికి చెందిన కొందరు భక్తులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
జేసీ సోదరుల దౌర్జన్యం..
విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న భక్తులు.. జేసీ దివాకర్ రెడ్డి సోదరులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అనుకూల పత్రికల్లో తమపై తప్పుడు కథనాలు రాయించారని వాపోయారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎక్కడో అనంతపురంలో ఉన్న ఆశ్రమ భక్తులు తన దగ్గరకు వచ్చారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించాయో తెలుస్తోందని అన్నారు. తాడిపత్రిలో రౌడీ రాజ్యం చెలరేగిపోతోందని విమర్శించారు.
ఓ వైపు చింతమనేని.. మరోవైపు జేసీ సోదరులు..
అల్లర్లు అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి తన వాళ్లను ప్రోత్సహిస్తూ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోతుంటే మరోవైపు తాడిపత్రిలో చిన్నాపెద్ద, ఆడావాళ్లన్న తేడా లేకుండా జేసీ వర్గీయులు అందరినీ చావగొట్టారని మండిపడ్డారు జగన్. ఈ ఘర్షణలు రెచ్చగొట్టిన నాయకులను జైలులో వేసి నాలుగు తగిలిస్తేనే భవిష్యత్లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు.
అండగా ఉంటామన్న జగన్
ఆశ్రమానికి, స్వామి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని జగన్ హమీ ఇచ్చారు. ఈ అన్యాయమైన పాలన ఎక్కువ రోజులు కొనసాగదని, ధైర్యంగా ఉండాలని భక్తులకు జగన్ భరోసా ఇచ్చారు. కాగా, తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకూ ఒకరు చనిపోగా, 45మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపుతప్పకుండా చూస్తున్నారు.