అసెంబ్లీలో జగన్ అదే వ్యూహం: చంద్రబాబు కౌంటర్ వ్యూహం
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారంపై రేపు శుక్రవారం శాసనసభలో అదే వ్యూహాన్ని అనుసరించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాల్ మనీ వ్యవహారంపై తక్షణ చర్చ జరపాలంటూ వైసిపి సభ్యులు గురువారం శాసనసభలో పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్పై తొలుత చర్చిద్దామని, రేపు కాల్ మనీ వ్యవహారం చంద్రబాబు ప్రకటన చేస్తారని, దాని తర్వాత చర్చ ఉంటుందని ప్రభుత్వ పక్షం చెప్పినా వైసిపి వినలేదు.
అయితే, వైసిపి డిమాండ్పై దిగి రాకూడదనే గట్టి పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రేపు అనుసరించాల్సిన వ్యూహంపై అటు వైయస్ జగన్ తన శాసనసభా పక్ష సమావేశంలో చర్చించగా, వైసిపిని కౌంటర్ చేసే వ్యూహంపై చంద్రబాబు మంత్రులూ శాసనసభ్యులతో చర్చించారు. వైసిపిని దీటుగా ఎదుర్కోవాలని చంద్రబాబు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు.
అంబేడ్కర్పై చర్చ జరిగిన తర్వాతనే శానససభలో కాల్ మనీపై చర్చను తీసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేసి చర్చ జరపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు, ఇందుకు అనుగుణంగానే మంత్రులకు, టిడిపి ఎమ్మెల్యేలకు సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులపై ఎదురుదాడికి దిగాలని కూడా ఆయన సూచించినట్లు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లరు గంగిరెడ్డి వంటివారితో సంబంధాలను ఎత్తిచూపుతూ వైయస్ జగన్ను కార్నర్ చేయాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ఎదుర్కుంటున్న కేసులను కూడా ప్రస్తావించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
మొత్తం రేపు శుక్రవారం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేడిగా సాగే సూచనలే కనిపిస్తున్నాయి. కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న సంబంధాలను బయటపెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.