బహిరంగ సభలో స్పీచ్ ఆపి, అంబులెన్స్కు దారి చూపి, బాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు
విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గుర్లలో జరిగిన బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఓ అంబులెన్స్ వచ్చింది. కిక్కిరిసి ఉన్న బహిరంగ సభ వద్దకు అంబులెన్స్ రావడంపై ప్రతిపక్ష నేత సెటైర్లు వేశారు.
అంబులెన్స్ ఇంకా బతికే ఉందని మనకు చూపించేందుకే వాళ్లు (టీడీపీ) నికృష్ఠ ఆలోచనతో ఈ అంబులెన్స్ ఇక్కడకు వచ్చిందని, అందులో పేషెంట్ లేరని తమకు తెలుసునని చెబుతూ.. అంబులెన్స్ డ్రైవర్ను ఉద్దేశించి.. అందులో పేషెంట్ లేరని అందరికీ తెలుసు అబ్బా.. రా.. రా.. వచ్చేయ్.. అంటూ వ్యాఖ్యానించారు. అంబులెన్స్కు దారి ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు.
ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉందా?
మనం మాట్లాడే మాటలు వింటున్నారు కాబట్టి, అంబులెన్స్ ఇంకా బతికే ఉందని చూపించడం కోసం దీనిని ఇటువైపు పంపించారని జగన్ అన్నారు. ఇక్కడ అది వెళ్లేందుకు భారీ జనం కారణంగా రోడ్డు లేకపోయినప్పటికీ, అయినా ఈ జనంలో నుంచి అంబులెన్స్ను తీసుకువెళ్లాలని చూస్తున్నారంటే, ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. అయ్యా, చంద్రబాబు.. నీకు సిగ్గులేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని, బండి పోవడానికి దారి లేదని కనిపిస్తూనే ఉందని, వేరే దారిలో పోకుండా ఇదే దారిలోనే పోతోందని మండిపడ్డారు.
ఇదీ మన మీడియా, సీట్ల సర్వే 'ఈనాడు'కు కనిపించదు: అన్నీ చెప్పి దుమ్మెత్తిపోసిన జగన్
మనం మాత్రం మంచి చేద్దాం
వాళ్లు ఏ నికృష్టపు ఆలోచనతో చేసినా మనం మాత్రం మంచి చేద్దామని, అంబులెన్స్కు దారి ఇద్దామని, అందరూ దానికి కొద్దిగా దారి ఇవ్వాలని జగన్ కార్యకర్తలకు, సభకు హాజరైన ప్రజలకు సూచించారు. అంబులెన్స్లో పేషెంట్ ఎవరూ లేరన్న విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రానీ.. రానీ.. వెళ్లమంటూ అంబులెన్స్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.
108 వాహనాలు చెడిపోయి షెడ్లలో ఉన్నాయి
108 వాహనాలు చెడిపోయి షెడ్లలో ఉన్నాయని జగన్ మండిపడ్డారు. ఈ అంబులెన్స్ ఇటు రావడం వెనుక ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో చేసినా దానికి దారి ఇవ్వడం మన బాధ్యత అన్నారు. జగన్ తన స్పీచ్ను ఆపి, అంబులెన్స్ రావడంపై సెటైర్లు వేస్తూ, మరోవైపు దానికి దారివ్వాలని కార్యకర్తలకు సూచించారు.
వికృత చర్య
ఆరోగ్యశ్రీ గురించి చేసిన వ్యాఖ్యలకు ఇది వికృత చర్య, మీ అందరి తరపున చంద్రబాబును నేను ప్రశ్నిస్తున్నానని, మూగ, చెవుడు ఉన్న పిల్లల పరిస్థితి ఎలా ఉందో, నీ దిక్కుమాలిన బుర్రలో ఎప్పుడైనా ఆలోచన చేశావా అని జగన్ మండిపడ్డారు. ఈ పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ కోసం వెళితే సాకులు వెతుకుతున్నారన్నారు.