కరోనాపై యుద్దం.. ఇదీ జగన్ యాక్షన్ ప్లాన్... ఎక్కడికక్కడ..
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని రాష్ట్రంలో హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో క్వారెంటైన్ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100-150 పడకలతో క్వారెంటైన్ సెంటర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ నియోజకవర్గంలో ఎక్కడ క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారో చెబుతూ కలెక్టర్లు ఆరోగ్యశాఖకు నివేదికను కూడా అందజేశారు.
ఎక్కడికక్కడ.. ప్రతీ నియోజకవర్గంలో..
నియోజకవర్గంలోని స్కూళ్లు,కాలేజీలు,ప్రభుత్వ భవనాలు,పెద్ద ఆసుపత్రులు.. ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల క్వారెంటైన్ కేంద్రాలు వద్దంటూ గ్రామస్తులు అడ్డుపడినప్పటికీ.. వారికి నచ్చజెప్పి ఒప్పించారు. కరోనా నియంత్రణలో క్వారెంటైన్ కేంద్రాలది కీలక పాత్ర కావడంతో.. ఇక్కడ సేవలందించేందుకు సిబ్బంది కొరత లేకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు,ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను ఇందులో నియమించనున్నారు. అలాగే ఒక్కో క్వారంటైన్ కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ను ఇన్చార్జిగా నియమించనున్నారు. ఆయన పర్యవేక్షణలోనే క్వారెంటైన్ కేంద్రం నిర్వహిస్తారు.
వెంటిలేటర్ పడకలు కూడా..
ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాల్లో.. ఒక్కో దానిలో 100 పడకలకు తగ్గకుండా ఏర్పాట్లు చేశారు. 10 నియోజకవర్గాల్లో వెంటిలేటర్లతో కూడిన క్వారెంటైన్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తలో భాగంగా మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వెంటిలేటర్తో కూడిన పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నియోజకవర్గంలో ఎవరికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడినా.. తక్షణం అతన్ని క్వారెంటైన్కు తరలించేలా వలంటీర్లు,స్థానిక ప్రజా ప్రతినిధులు,హెల్త్ కేర్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు.
మరిన్ని క్వారెంటైన్ సెంటర్స్
రాష్ట్రంలో తాజాగా మరో 4 మెడికల్ కాలేజీల్లో కరోనా ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లా ఆస్పత్రులు, మరో 7 మెడికల్ కాలేజీల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా రోగులందరికీ ఇక్కడే చికిత్స అందించనున్నారు. విశాఖపట్నం,విజయవాడ వంటి జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో క్వారెంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. వైరస్ ఒక్కసారిగా విజృంభించినా.. తట్టుకోగలిగే స్థితిలో రాష్ట్రం ఉండేలా మరిన్ని క్వారెంటైన్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది.
క్వారెంటైన్ వసతులు..
క్వారెంటైన్ కేంద్రంలో డాక్టర్లతో పాటు హెల్త్ కేర్ సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉంటారు. ఉచిత భోజనం,తాగునీరు అందిస్తారు. వైరస్ వ్యాప్తి చెందకుండా రోగులు,వైద్య సిబ్బందికి మాస్కులు,ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్,శానిటైజర్స్ అందిస్తారు. నిరంతరం సేవలందించే అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రిలో 24గంటల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. ప్రతీ పడకకు కనీసం రెండు మీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వచ్చే పేషెంట్స్ వివరాలన్నింటిని నోడల్ అధికారి పర్యవేక్షిస్తుంటారు.