ఇక టార్గెట్ ఎంపీ సుజానా చౌదరీ.. అమరావతిలో భూములపై జగన్ ప్రభుత్వం ఆరా
అమరావతి: ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి, ఆ తర్వాత బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి, ఆయన బంధువులపై వైయస్ జగన్ ప్రభుత్వం నిఘా పెట్టిందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయనకు లేదా ఆయన బంధువులకు బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? అని రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా విచారణ జరుపుతోందని తెలుస్తోంది. రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారట.
అధికారులు కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలంలోని పలు గ్రామాల పరిధిలో పర్యటించి భూముల అంశంపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న (సెప్టెంబర్ 18) మొగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు వంటి గ్రామాల్లో తిరిగి గ్రామస్తులను, రైతులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్ల గురించి ఆరా తీశారు.
ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ.. సుజనాకు భూములు ఉన్నట్లుగా ఆరోపణలు కూడా చేశారు. కంచికచర్ల మండల పరిధిలో భూములు ఉన్నాయని బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం, అమరావతి రాజధాని ప్రకటనకు ముందు, ఆ తర్వాత అక్కడి భూములు ఎవరి పేర ఉన్నాయి... ఎవరెవరి చేతులు మారాయి... ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఎవరి పేరున ఉన్నాయి.. అనే వివరాలు ఆరా తీస్తున్నారట.