నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. సుప్రీంలో జగన్ సర్కార్ పిటిషన్..
ఏపీలో నిమ్మగడ్డ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో హైకోర్టు తీర్పును రద్దు చేసి,జస్టిస్ కనగరాజు నియామకం చెల్లుబాటయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ప్రభుత్వం న్యాయ స్థానాన్ని కోరింది. పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది.
నిమ్మగడ్డ రీఎంట్రీ: రాజ్యాంగానికి, న్యాయవ్యవస్థ మధ్య: తవ్వి తీస్తోన్న సర్కార్: సుప్రీంలో
ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగ హక్కుల మేరకే కమిషనర్గా కనగరాజును నియమించామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైకోర్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను పున:నియమించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తానే ఎస్ఈసీని అంటూ నిమ్మగడ్డ రంగంలోకి దిగారు. కానీ ఏపీ హైకోర్టు తీర్పుతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ నియామకం, పదవి పునరుద్ధరణ ఉత్తర్వులు చెల్లబోవంటూ అడ్వకేట్ జనరల్ శ్రీరాం ప్రకటించడంతో వివాదం మరో మలుపు తిరిగింది.తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. నిమ్మగడ్డ పునర్నియామకం తీర్పుతో టీడీపీకి కొత్త ఉత్సాహం రాగా.. మీరెందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. మొత్తంగా రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎస్ఈసీ నియామకం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం. ఇక ఎస్ఈసీ వివాదం ముదురుతున్న సందర్భంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం(జూన్ 2) ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మండలి రద్దు,ఎస్ఈసీ వ్యవహారంపై ఆయన ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నట్టు తెలుస్తోంది.