BC Corporations : బీసీ కార్పోరేషన్లకు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్..! ఎన్నికలతో సంబంధం లేకుండా..!
ఏపీలో గత ఎన్నికల్లో తొలిసారి తమవైపు మొగ్గిన బీసీల్ని మరింత దగ్గర చేసుకునేందుకు వైసీపీ సర్కార్ తాజా అస్త్రం ప్రయోగించింది. ఇప్పటికే 55 బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుతో ఆయా కులాలకు ప్రాధాన్యం కల్పించిన ప్రభుత్వం, వాటి ద్వారా సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు బీసీలకు ప్రత్యేకించిన పలు పథకాలు వారికి అందించేందుకు ఏటా వేల కోట్ల నిధులు కూడా విడుదల చేస్తోంది. ఇప్పుడు ఆయా బీసీ కార్పోరేషన్లకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
బీసీ కార్పోరేషన్లకు బంపర్ ఆఫర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనాభా పరంగా అధికంగా ఉన్న వారికి అధికారంలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా 55 బీసీ కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ప్రతీ కార్పోరేషన్ కూ ఛైర్మన్ తో పాటు డైరెక్టర్లను కూడా నియమించారు. అప్పటికే వైసీపీ తరఫున పనిచేస్తున్న వారో, భవిష్యత్తులో ఉపయోగపడతారని అనుకున్న వారికి ఇందులో చోటు కల్పించారు. వీరికి రెండేళ్ల పదవీకాలంతో పాటు జీతభత్యాల్ని కూడా ప్రకటించారు. ఇప్పుడు వారికి జగన్ సర్కార్ మరో ఆఫర్ ఇచ్చింది.
పదవీకాలం పొడిగింపు
వైసీపీ సర్కార్ గతంలో నియమించిన 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలం గత డిసెంబర్ 16తో ముగిసింది దీంతో ఆయా కార్పోరేషన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న రాత్రి జీవో విడుదల చేశారు. ఇందులో ప్రతీ కార్పోరేషన్ కూ ప్రత్యేకంగా ఒక్కో జీవోను విడుదల చేశారు. ఇందులో సదరు కార్పోరేషన్ ఏర్పాటు తేదీ, పదవీకాలంతో పాటు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పెంపును ప్రభుత్వం ప్రస్తావించింది. దీంతో ఆయా కార్పోరేషన్లు తమ పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా కొనసాగబోతున్నాయి.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ?
రాష్ట్రంలో 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలాన్ని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా కార్పోరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన వారు కూడా అప్పటివరకూ ఈ పదవుల్లో కొనసాగబోతున్నారు. అంటే వచ్చే ఎన్నికలు పూర్తయిన తర్వాత వరకూ ఆయా కార్పోరేషన్ల పదవుల్లో వీరు ఉండే అవకాశముంది. తద్వారా వచ్చే ఎన్నికలతో సంబంధం లేకుండా వీరంతా రాబోయే ప్రభుత్వంలోనూ ఆయా కార్పోరేషన్ పదవుల్లో కొనసాగేందుకు వీలు కలగబోతోంది. తద్వారా ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేసినట్లయింది.