వైఎస్ జగన్ వెనకడుగు: బెడిసి కొడుతోన్న ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు: అవేవీ ఇప్పట్లో అమలు కానట్టే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న కొన్ని కీలక నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. వెనకడుగు వేసే పరిస్థితిని కల్పిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కొన్ని నిర్ణయాల్లో ముందడుగు వేయలేకపోతున్నారాయన. న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించినా.. ముందుకెళ్లలేకపోవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న సామాజిక స్థితిగతులే దీనికి కారణమని అంటున్నారు. ఫలితంగా- తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది ప్రభుత్వానికి. ఈ తాత్కాలికం అనేది ఎన్నాళ్లు ఉంటుందనే విషయంపై ప్రభుత్వ పెద్దల వద్ద కూడా సరైన సమాధానం లేదు.
Recommended Video
తమ అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్పష్టం చేసిన జగన్, షర్మిల: జీవితానికి సరిపడే ప్రేమను
డ్రీమ్ ప్రాజెక్టుపై సందేహాలు..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనేది వైఎస్ జగన్ ప్రధాన లక్ష్యం. ఒకరకంగా అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి. అమరావతిని చట్టసభల రాజధానిగా కొనసాగిస్తూనే.. ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనకు కేంద్రబిందువుగా.. రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయిస్తామని నిండు సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసిన మరుక్షణం నుంచే తెలుగుదేశం పార్టీ అడ్డుకునే ప్రయత్నాలను చేపట్టింది. ఇప్పటికీ కొనసాగిస్తోనూ వస్తోంది.
హైకోర్టులో పిటీషన్లు.. రైతుల నిరసనల దీక్షలు..
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారనే ప్రకటన కంటే.. అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్తోందనే మాటను తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లగలిగింది. అమరావతి చట్టసభల రాజధానిగా కొనసాగుతుందనే మాటను కూడా మర్చిపోయేలా చేసిందా ప్రచారం. రాజధాని తరలి పోతోందనే భయాందోళనల మధ్య అమరావతి ప్రాంత రైతులు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. కరోనా వైరస్ కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. అటు అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాలు, ఇటు మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టునూ ఆశ్రయించడం ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి.
ఇన్ని అడ్డంకుల మధ్య
ఇన్ని అడ్డంకుల మధ్య సచివాలయాన్ని విశాఖకు తరలించడానికి సిద్ధపడినప్పటికీ.. కరోనా వైరస్ రూపంలో మరో అడ్డంకి ఏర్పడింది. కరోనా వైరస్ విస్తరిస్తోన్న వేళ.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయలేకపోతోంది. విశాఖపట్నం, కర్నూలు సహా అన్ని జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య, కరోనా వైరస్ తీవ్రత ఇప్పట్లో తగ్గే పరిస్థితీ కనిపించట్లేదు. ఫలితంగా- మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన నుంచి ప్రభుత్వం తాత్కాలికంగా తప్పుకొన్నట్టే కనిపిస్తోంది.
శాసన మండలి రద్దూ అంతే..
శాసన మండలి రద్దు వ్యవహారం కూడా దీనికేమీ తీసిపోవట్లేదు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లు సహా దాదాపు అన్నింటినీ అడ్డుకుంటోన్న కారణంగా శాసన మండలిని రద్దు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించట్లేదు. ఏ శాసన మండలిని రద్దు చేస్తామని వైఎస్ జగన్ చెప్పారో..మొన్నటి సమావేశాల సందర్భంగా అదే శాసన మండలిలో అడుగు పెట్టాల్సి వచ్చింది. శాసన మండలిని రద్దు చేయడం అనేది ప్రస్తుతం కేంద్రం పరిధిలో ఉంది. మండలిని రద్దు చేస్తూ శాసనసభ చేసినతీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కరోనా వల్ల ఇప్పట్లో పార్లమెంట్ సమావేశం కావడం అసాధ్యం.
మూడు రాజధానులు, మండలి రద్దు..
ఈ పరిణాామాల మధ్య మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ గానీ, శాసన మండలి రద్దు గానీ.. ఇప్పట్లో అమల్లోకి వచ్చేలా కనిపించట్లేదు. ఈ ఏడాది అన్నీ యధాతథంగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ఉధృతి తగ్గిన తరువాతే..వాటిల్లో కదలిక ఏర్పడే అవకాశం ఉంది. ఈ లోగా న్యాయపరమైన ఇబ్బందులు, చిక్కుముళ్లను అధిగమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన చర్యలను చేపడుతోంది.