‘జగన్ సర్కారు తప్పుడు ప్రచారం’: జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్, భారీగా పోలీసుల మోహరింపు
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం కానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదని అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా చెప్పారు.
జగన్ సర్కారు తప్పుడు ప్రచారం..
తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ-దొందే అని పవన్ ఎద్దేవా చేశారు. న్యూఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాన్ని పవన్ కళ్యాణ్ తన ట్వీట్కు జత చేశారు.
మోడీ, అమిత్ షాలకు జగన్ చెప్పినట్లుగా..
ఈ పత్రిక కథనంలో ఏముందంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులతో పరిపాలన వికేంద్రీకరణ చేసేందుకు నిర్ణయించిన విషయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్..
సోమవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరుగుతోంది. మూడు రాజధానుల వ్యవహారంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మూడు రాజధానులకు ఎమ్మెల్యే రాపాక మద్దతివ్వడంపైనా చర్చ జరుగుతోంది. సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల కోసం వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మూడు రాజధానులను సమర్థిస్తూ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు చేయడం గమనార్హం.
జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కాగా, ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించడంపై జనసేన పార్టీ శ్రేణలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలు ఎర్రబాలెం, పెనుమాక, మందడం తదితర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా, రాత్రి 8గంటలకు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.