హోంగార్డులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. తాజాగా, హోంగార్డులకు తీపికబురు చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి రూ. 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పాదయాత్రలో ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు హోంగార్డుల వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హోంగార్డులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
15 నుంచి రైతు భరోసా
నెల్లూరు జిల్లాలో అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అక్టోబర్ 15న ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డుల పంపిణీ అనంతరం రైతులకు వైఎస్సార్ రైతు భరోసా చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఏపీని ప్రముఖ స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పర్యాటక, పురావస్తు, యువజన వ్యవహారాల శాఖల సమీక్ష సమావేశం సందర్భంగా జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లో భారీ అవకతవకలు జరిగాయాంటూ ఆరోపణలు వినిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎం రిలీఫ్ ఫండ్)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అర్హులైన వారికే సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.