ఎమ్మెల్సీ అభ్యర్థులతో వైఎస్ జగన్ భేటీ: కీలక అంశాలపై ఫోకస్
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కొద్దిసేపటి కిందటే శాసన మండలి అభ్యర్థులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన ఎమ్మెల్పీ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి గురువారమే తుదిగడువు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులందరూ ముఖ్యమంత్రిని కలిశారు. వైఎస్ జగన్ వారికి బీఫాంలను అందజేశారు.
వైసీపీకి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి హఠాన్మరణం, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా వల్ల రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అదే సమయంలో నలుగురు సభ్యుల పదవీకాలం ముగిసింది. మొత్తంగా ఈ ఆరు స్థానాలకు ఈ నెల 15వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఆఱు స్థానాల కోసం వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేసింది.
సీ రామచందయ్య, మహ్మద్ ఇక్బాల్, కరిమున్నీసా, బల్లి కల్యాణ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్లను వైఎస్ జగన్ ఎంపిక చేశారు. వారంతా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం జగన్ చేతుల మీదుగా బీఫామ్లను అందుకున్నారు. ఈ ఆరుమందినీ గెలిపించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉంది. వారి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. దీనితో శాసన మండలిలో వైసీపీ బలం భారీగా పెరుగుతుంది.
వచ్చే నాలుగు నెలల్లో వేర్వేరు కోటాల కింద మరో 18 స్థానాలు ఖాళీ కానున్నాయి. అవన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్తాయి. ఫలితంగా- మరి కొన్ని నెలల్లో మండలిలో వైసీపీ బలం 24కు పెరుగుతుంది. బీఫామ్ అందజేసిన తరువాత ముఖ్యమంత్రి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి దిశా నిర్దేశం చేశారు. పెద్దల సభ గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని సూచించారు. చట్టసభల పనితీరు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. మండలిలో కీలక బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీ సభ్యుల వైఖరిని ఎండగట్టేలా వివరణాత్మకంగా విమర్శలను సంధించాలని చెప్పారు.