లక్షల కోట్లు దిగమింగినవారు మాపై: జగన్పై దేవినేని ఉమ, నారాయణ
విజయవాడ/ విశాఖపట్నం: పట్టిసీమ గురించి మాట్లాడే అర్హత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, నారాయణలు విమర్శించారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ అధికారులతో వారు గురువారంనాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
పట్టిసీమ పనులను జగన్ ఓసారి పరిశీలించి అవినీతి జరుగుతుందో, లేదో పరిశీలించవచ్చని మంత్రులు సూచించారు. లక్షలకోట్లు దిగమింగినవారిప్పుడు తమపై ఆరోపణలు చేస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. పట్టిసీమ మొదటిదశ పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ స్థిరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రులు తెలిపారు.
వచ్చే నెల ఉపాధి మేళా
ఇదిలావుంటే, బీసీ సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ సంక్షేమంపై ఆయన గురువారంనాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 5న బీసీ ఉపాధిమేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని వలన 25వేల మంది లబ్ధి పొందుతారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమానికి రూ. 126 కోట్లు కేటాయించామనీ, బీసీల సంక్షేమం కోసం రూ. 6,640 కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులను ఖర్చుపెడుతున్నామనీ, బీసీ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.
రిషికేశ్వరీ కేసు సీరియస్
విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్కు అబ్దుల్ కలాం పేరు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని ఆయన తెలిపారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో ప్రక్షాళన మొదలుపెట్టామని గంటా చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో కులసంఘాలను నిషేధిస్తామని ఆయన తెలిపారు.