cpi narayana: తెలంగాణకు సీఎం జగన్ మేలు, హైదరాబాద్లో రియల్ భూం, రాజధాని మార్పు సరికాదు..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నారాయణ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన ఆంధ్రులకు సేవ చేయడం లేదని, తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిని మారుస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
తెలంగాణకు మేలు..
సీఎం జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ.. తెలంగాణ ప్రజలకు మేలు చేకూరుస్తున్నారని నారాయణ ఆరోపించారు. మూడు రాజధానుల ప్రకటనతో.. 24 గంటల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూం వచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. సీఎం జగన్కు ధన్యవాదాలు చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రుల హక్కు
హైదరాబాద్లో మళ్లీ భూముల ధరలు పెరగడానికి పరోక్షంగా జగన్ కారణమయ్యారని నారాయణ గుర్తుచేశారు. అమరావతి రాజధాని 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కు అని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు మారుస్తున్నారని సీఎం జగన్ను ప్రశ్నించారు. ఇదివరకు సీఎంగా చంద్రబాబు ఉండేవారని.. వైసీపీ విజయం సాధించడంతో జగన్ పగ్గాలు చేపట్టారని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ముఖ్యమని నొక్కి వక్కానించారు.
మేనిఫెస్టోలో ఎందుకు లేదు..
రాజధానిని మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని సీఎం జగన్ను సీపీఐ నారాయణ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పెడితే అప్పుడు ప్రజాతీర్పు తెలుస్తోందని చెప్పారు. అలా మేనిఫెస్టోలో పెట్టకుండా.. అధికారం చేపట్టిన తర్వాత రాజధానిని మార్చడం సరికాదని సూచించారు. రాజధాని మార్పు అనే ప్రతిపాదనను జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూ మాఫియా..
ఇప్పుడే కాదు ఇదివరకు కూడా రాజధాని మార్పును సీపీఐ నారాయణ వ్యతిరేకించారు. విశాఖలో ఇప్పటికే భూ మాఫియా దిగిందని ఆరోపణలు కూడా చేశారు. గంటా శ్రీనివాస్ కుమారుడు, వైసీపీ నేతల కబంధహస్తాల్లో విశాఖ భూములు ఉన్నాయని చెప్పారు.