జైట్లీ పాత పాట, చంద్రబాబు కొత్త నాట్యం, ఆస్కార్ దక్కేది: జగన్
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. భారతీయులపై ఉక్కు పిడికిలికి జడిసిన బ్రిటిష్ వాడు పోతూ పోతూ ఇది నేనిచ్చిన స్వాతంత్ర్యం అంటే ఎలా ఉండేదో సరిగ్గా చంద్రబాబు తీరు అలా ఉందని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రస్తుతం ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పలేదని అన్నారు. అయినా తానే హోదా పోరాటం చేశానని చెప్పుకోవడం చంద్రబాబు సిగ్గమాలినతనానికి నిదర్శనమని అన్నారు. తన 108వ ప్రజా సంకల్ప యాత్రలోప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో క్లాక్ టవర్ వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
చంద్రబాబు కలిసి రావాలి
ఇప్పటికైనా హోదా మాటెత్తిన టిడిపి కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై కలిసి రావాలని జగన్ పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అన్యాయమైన పాలనే చేస్తున్నారని, కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కూడా సాధించలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదాను చందర్బాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు.
చంద్రబాబు కొత్త నాట్యం
మొన్న అరుణ్ జైట్లీ పాత పాట పాడితే చంద్రబాబు కొత్త నాట్యం చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అరుణ్ జైట్లీ 2105లో తెగేసి చెప్పినప్పుడే చంద్రాబబు మంత్రులతో రాజీనామాలు చెయించి ఉంటే ఈ పాటికి హోదా వచ్చి ఉండేదని అన్నారు. నాలుగేళ్లు మంత్రి పదవులు అనుభవించి ఎన్నికలు సమీపించడంతో ప్లేట్ ఫిరాయించారని అన్నారు.
ఇప్పటికైనా సరిగ్గా పోరాడుతారా అంటే...
ఇప్పటికైనా కేంద్రంపై చంద్రబాబు సరిగ్గా పోరాడుతారా అంటే అదీ లేదని వైఎస్ జగన్ అన్నారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తారట, ఎన్డీఎలో కొనసాగుతూనే ఉంటారట అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అసెంబ్లీలో బిజెపి, టిడిపిలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారని, పార్లమెంటులో అవిశ్వాసం పెడుదాం రావాలంటే చంద్రబాబు ప్రతిస్పందించరని అన్నారు.
ఆస్కార్ అవార్డులు రావాలి...
రాష్ట్రానికి రాష్ట్రమే రాజీనామాలు చేస్తే కేంద్రంలో తప్పక కదలిక వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. కానీ ఆ పెద్ద మనిషికి (చంద్రబాబుకు) చిత్తశుద్ధి లేదని అన్నారు .ఇటీవల ఉత్తమ నటులకు ఇటీవల ఆస్కార్ అవార్డులు దక్కాయని అన్నారు. పాపం వాళ్లకు మన చంద్రబాబు కనిపించలేదని అన్నారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆడుతున్న నాటకాలకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు దక్కేదని అన్నారు..
ఎన్నికల వేళ ఆలోచించండి...
చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మోసాలు చేసే అబద్దాలు చెప్పే చంద్రబాబు వంటి వాడిని పొరపాటున కూడా క్షమించవద్దని జగన్ అన్నారు. ఒక నాయకుడు మైక్ పట్టుకుని ఒక మాట చెప్తే దాన్ని నిలబెట్టుకోలేని రోజున రాజీనామాలు చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలని అన్నారు. ఆ మార్పు తన ఒక్కడి వల్లనే కాదని, మీ అందరి సహకారంతో సాధ్యమవుతుందని అన్నారు.