సినిమా చూపిస్తున్నారు: చంద్రబాబును ఏకేసిన జగన్(పిక్చర్స్)
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కరువుతో రైతులు అల్లాడిపోతుంటే.. వారిని ఆదుకునేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కరువు విషయమే తనకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
వినతి పత్రం
కరవు కోరల్లో చిక్కి అనంత రైతాంగం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలతో కపట నాటకాలు అడుతున్నారని జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నిలువునా ఎండిపోతున్నా తనకు తెలీదని, ఎవరూ చెప్పలేదంటూ.. రెయిన్గన్ల సినిమా మొదలు పెట్టారని విమర్శించారు. ఆరు రోజుల పాటు జిల్లాలో పర్యటించి జలఫిరంగుల ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కరవు పారదోలామని బూటకపు మాటలు మాట్లాడారని విరుచుకుపడ్డారు.
అనంత రైతాంగం
అనంతపురం జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, మరో3 లక్షల ఎకరాలు ఇతర పంటలు వేశారన్నారు. వీటిలో 80 శాతం పంటలు ఎండిపోయాయన్నారు. రాయలసీమ మొత్తంగా 21.6 లక్షల ఎకరాల్లో పంట వేస్తే 17.27 లక్షల ఎకరాల్లో పంట నిలువునా ఎండిపోయిందన్నారు. అనంతపురం జిల్లాలో కరవు ఉందా..నాకు తెలియదే... అధికారులెవరూ చెప్పలేదే.. మంత్రులు కూడా తెలియజేయలేదే.. అంటూ ముఖ్యమంత్రి కల్లిబొల్లిమాటలు చెప్పారన్నారు. మరి తన వద్ద కోర్ డ్యాష్బోర్డు ఉందికదా.. కంప్యూటర్లు ఉన్నాయికదా.. అందులో ఒక బటన్ నొక్కితే మొత్తం తెలిసి పోతుందంటున్నారే.. ఆగస్టు నెలలో 15 రోజుల్లోపే రెండుసార్లు అనంతపుర జిల్లాకు వచ్చిన ఆ పెద్దమనిషికి ఇక్కడి కరవు కనిపించలేదా అని ప్రశ్నించారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రెయిన్గన్ల సినిమా మొదలు పెట్టారన్నారు. నాలుగు రోజుల్లోనే 4 లక్షల ఎకరాలకు నీటి తడులు ఇచ్చామని అబద్ధాలాడారని ధ్వజమెత్తారు. హెలికాప్టర్లో పరిశీలిస్తే కరవు కనిపిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఎకరాకు 5 నుంచి 6 ట్యాంకర్ల లెక్కన రోజుకు 25 లక్షల నుంచి 30 లక్షల ట్యాంకర్లు మేరకు నీరివ్వాల్సి ఉందని, అది సాధ్యమేనా అని జగన్ ప్రశ్నించారు.
మహాధర్నా
మంత్రి కొల్లు రవీంద్ర సెప్టెంబర్లో జిల్లాలో పర్యటించినపుడు 80 శాతం పంట ఎండిపోయిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నానని చెప్పారన్నారు. ఓపక్క పంట ఎండిపోయిందని మంత్రి అంటున్నారు, మరోపక్క పంటలు రక్షించామని సీఎం చెబుతున్నారు.. ఏది నిజమో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల ద్వారా 120 టిఎంసిల నీటిని తెలంగాణ తరలించుకుపోతున్నా, పోలవరంపై లిఫ్ట్ పెట్టి నీటిని తీసుకుపోతున్నా అడిగే పరిస్థితిలో సిఎం లేరని జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటర్లు, పిల్లకాలువల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవాలని, రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవాకు 12 పంపులు ఏర్పాటుచేసినా ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు.
హాజరైన జన సందోహం
వైయస్ రాజశేఖరరెడ్డి 2004లో సిఎం అయ్యాక ఉచిత విద్యుత్, రైతు రుణ వడ్డీ మాఫీ, రుణాల రెన్యూవల్, కొత్త రుణాలు ఇవ్వడంపై కేంద్రంతో పోరాడి సాధించారన్నారు. అప్పట్లో వైఎస్ కృషి ఫలితంగా దేశంలో మొత్తం 21 జిల్లాల్లో కరువు ఉందని కేంద్రం ఆమోదించిందని, అందులో 16 మండలాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుచేశారు. హంద్రీనీవా, గాలేరు నగరి, పులిచింతల, వెలిగొండ ప్రాజెక్టులు ప్రారంభించిన ఘనత వైఎస్దేనన్నారు. కేంద్రంతో పోరాడి కరవు నిధులు సాధించడంలో బాబు విఫలమయ్యారన్నారు.