వెలగపూడిలో జగన్... కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ ..గోప్యంగా అజెండా .. హోం మంత్రికి నిరసన సెగ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ రాజధాని విషయంలో తుది నిర్ణయం వెల్లడించటానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ నేటి నుండి జరగనుంది . ఇక రాజధాని అమరావతి కోసం ఆందోళనలు ఉధృతంగా మారటంతో పోలీసులు అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు . నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపధ్యంలో వెలగపూడిలోని సచివాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఇక అత్యంత గోప్యంగా క్యాబినెట్ భేటీ కొనసాగుతుంది.
భారీ భద్రత మధ్య వెలగపూడి వెళ్ళిన జగన్ .. కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ
భారీ భద్రత మధ్య సీఎం జగన్ వెలగపూడి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కాన్వాయ్ ని పంపిన ఉన్నతాధికారులు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం జగన్ రెండో గేటు నుండి లోనికి వెళ్ళారు. మంత్రులు సైతం రెండో గేటు నుండి లోపలి వెళ్ళారు. జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఏపీ కేబినెట్ భేటీలో కీలక విషయాల చర్చ జరుగుతుంది . కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తుంది .
ఏడు అంశాలపై క్యాబినెట్ లో చర్చ
ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోందని సమాచారం . హైపవర్ కమిటీ నివేదిక, రాజధాని కమిటీల సిఫార్సులపై కేబినెట్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుపై చర్చ , రాష్ట్రంలో 4 జోన్లు ఏర్పాటు నిర్ణయం, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
గోప్యంగా క్యాబినెట్ భేటీ
రాజధాని రైతుల అంశంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణను లోకాయుక్తకు అప్పగించడానికి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు.. రైతు భరోసా కేంద్రాలపై కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది.ఇక మరోపక్క రాజధాని ప్రాంతాల ప్రజల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
హోం మంత్రి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపిన జేఏసీ
పాలనా వికేంద్రీకరణకు మొగ్గు చూపుతూ మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అమరావతి జేఏసీ సభ్యులు హోంమంత్రి సుచరిత ఇంటిని ముట్టడించారు . గుంటూరులోని ఆమె ఇంటిని ఈరోజు ఉదయం చుట్టుముట్టిన జేఏసీ సభ్యులు సుచరిత ఇంటి ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, డేగ ప్రభాకర్, నజీర్, గోళ్ల ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు సుచరిత ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేసి నల్లపాడు స్టేషన్కు తరలించారు.