ఏడీఆర్ రిపోర్ట్: దేశంలోనే అత్యధిక సంపాదించే ఎమ్మెల్యేల్లో జగన్కు 5వ స్థానం, మన ఎమ్మెల్యేలు ఇలా..
అమరావతి/న్యూఢిల్లీ: భారత దేశంలో అత్యధికంగా సంపాదన కలిగిన ఎమ్మెల్యేల్లో ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదో స్థానంలో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజాగా వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంపాదన కలిగిన ఎమ్మెల్యే జగన్.
రూ.500తో పోయే బాబ్లీ కేసుపై రాద్ధాంతం, జగన్కిస్తే అలా, మీకు వస్తే ఇలా: బాబుపై విష్ణు
వైసీపీ అధినేత వ్యక్తిగత ఆదాయం రూ.13.92 కోట్లుగా ఉంది. కుటుంబం ఆదాయం రూ.18.13 కోట్లుగా ఉంది. ఏడాదికి దేశంలోని ఎమ్మెల్యేల సరాసరి చూస్తే ఒక్కో ఎమ్మెల్యే ఆదాయం రూ.24.59 లక్షలుగా ఉంది. 4,086 మంది ఎమ్మెల్యేలకు గాను ఏడీఆర్ సొంతగా తమ ఆస్తులను ప్రకటించిన 3,145 మంది ఆదాయ వివరాలను వెల్లడించింది.
జగన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వీరే
తెలుగు రాష్ట్రాల్లో జగన్ తర్వాత నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్, రూ. 9.21 కోట్ల వ్యక్తిగత, రూ.10.76 కోట్లు కుటుంబ ఆదాయంతో 8వ స్థానంలో ఉన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ. 8.49 కోట్ల వ్యక్తిగత, రూ. 8.61 కోట్ల కుటుంబ ఆదాయంతో 10వ స్థానంలో, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రూ.6.48 కోట్ల వ్యక్తిగత ఆదాయంతో, రూ.7.96 కోట్ల కుటుంబ ఆదాయంతో 14వ స్థానంలో ఉన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రూ.4.85 కోట్ల వ్యక్తిగత, రూ. 5.54 కోట్ల కుటుంబ ఆదాయంతో 19వ స్థానంలో ఉన్నారు.
యామినీ బాలకు అత్యల్ప ఆదాయం
తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఆదాయం ఉన్న ఎమ్మెల్యేలలో శింగనమల ఎమ్మెల్యే యామినీబాల వ్యక్తిగత ఆదాయం 1,301 అని, కుటుంబ ఆదాయం కూడా అంతేనని ఏడీఆర్ వెల్లడించింది. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ కూడా తక్కువ రాబటి కలిగి ఉన్నారు. అతను రూ.60,000 సంపాదిస్తున్నారు. దేశంలోనే ఎక్కువ ఆదాయం పొందుతున్న ఎమ్మెల్యేలలో కర్ణాటక కాంగ్రెస్ ఎంటీబీ ఎమ్మెల్యే నాగరాజ్ నిలిచారు. దేశం మొత్తంలోనే ఈయన టాప్. రూ.157 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత మహారాష్ట్రలోని మలబార్ హిల్స్ ఎమ్మెల్యే మంగల్ ప్రబాత్ లోధా రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో మళ్లీ కర్ణాటక ఎమ్మెల్యే బసవరాజ్ నిలిచారు. నాలుగో స్థానంలో నంగేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలిచారు.
దక్షిణాది ఎమ్మెల్యేలు శ్రీమంతులు
దేశవ్యాప్తంగా దక్షిణాది ఎమ్మెల్యేలు శ్రీమంతులుగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేలు పేదలు అని ఏడీఆర్ పేర్కొంది. గత ఎన్నికల సందర్భంగా 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను మధించి ఈ వివరాలు సేకరించామని పేర్కొంది.
చదువు తక్కువ, ఆదాయం ఎక్కువ
దక్షిణాదిన ఉన్న 711 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం రూ.51.99 లక్షలుగా ఉండగా, ఈశాన్య రాష్ట్రాల్లోని 614 మంది ఎమ్మెల్యేల వార్షికాదాయం రూ.8.53 లక్షలుగా ఉంది. 139 మంది ఎమ్మెల్యేలు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. వీరి ఆదాయం చాలా ఎక్కువని తెలిపింది. 33% మంది ఎమ్మెల్యేలు తాము అయిదో తరగతి నుంచి ఇంటర్ తరగతి వరకు చదివినట్లు తెలిపారు. వీరి సగటు వార్షికాదాయం రూ.31.03 లక్షలు. 63% ఎమ్మెల్యేలు డిగ్రీ, ఆపైన చదివారు. వీరి వార్షిక సగటు ఆదాయం రూ.20.87 లక్షలు. నిరక్షరాస్యులుగా పేర్కొన్న ఎమ్మెల్యేల వార్షిక ఆదాయం రూ.9.31 లక్షలుగా ఉంది.
మహిళల శాతం తక్కువ
ప్రస్తుతం దేశంలో 50 ఏళ్ల లోపున్న ఎమ్మెల్యేల సంఖ్య 1,402గా ఉంది. 80 ఏళ్లలోపు 1,727 మంది, 90 ఏళ్ల వరకూ వయసున్న వారు 11 మంది ఉన్నారని ఏడీఆర్ పేర్కొంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 8 శాతం మంది మాత్రమే మహిళలని తెలిపింది.
కర్ణాటక టాప్, మహారాష్ట్ర రెండో స్థానం
కర్ణాటకలోని 204 మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం రూ.1.11 కోట్లు. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్నవారు వీరే. రూ.43.4 లక్షల సగటు ఆదాయంతో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు రెండో స్థానంలో నిలిచారు. 64 మంది ఛత్తీస్గడ్ ఎమ్మెల్యేల వార్షికాదాయం అత్యల్పంగా రూ.5.4 లక్షలు మాత్రమే. సభ్యుల్లో రెండు శాతం మంది తమ వృత్తి ఏమిటన్నది అఫిడవిట్లలో చెప్పలేదు. నాలుగో వంతు మంది తాము వ్యాపారులమనీ, మరో దాదాపు పావు వంతు మంది రైతులమనీ తెలిపారు. వ్యవసాయం, వ్యాపారాన్ని వృత్తిగా ప్రకటించిన 13% మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం అందరికంటే ఎక్కువగా (రూ.57.81 లక్షలు) ఉంది.