హైదరాబాద్కు వైఎస్ జగన్ గుడ్బై: ఇక ఫుల్ టైమ్ అమరావతిలో: తొలి వైసీపీఎల్పీ భేటీ అక్కడే!
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో హైదరాబాద్కు గుడ్బై చెప్పబోతున్నారు. ఇక అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారు. రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో వైఎస్ జగన్ కొత్తగా ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇందులోనే కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన అక్కడి నుంచే పూర్తిస్థాయిలో రాజకీయాల కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నద్ధులవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాడేపల్లిలో గృహప్రవేశం చేశారు కూడా. గృహప్రవేశం చేసిన రోజు రాత్రే ఆయన హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసానికి వచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
విమర్శలకు చెక్ చెప్పినట్టే..
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైఎస్ జగన్ నివాస స్థలంపై అనేక విమర్శలు గుప్పించారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దీన్ని అస్త్రంగా మార్చుకున్నారు. ప్రతి సభలోనూ, ప్రతి రోడ్షోలోనూ చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. పొద్దున ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తాడు..సాయంత్రం కాగానే లోటస్ పాండ్కు వెళ్లిపోతాడంటూ ఆరోపించారు. లోటస్పాండ్ ఇంటి నుంచి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి ఆంధ్రులకు ద్రోహం చేస్తున్నారంటూ ఇష్టానుసారంగా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. లోటస్పాండ్ కేంద్రంగా కుట్ర రాజకీయాలు చేశాడని విమర్శలు చేశారు. వాటన్నింటికి చెక్ పెట్టేలా- ఇక పూర్తిస్థాయిలో తాడేపల్లి నుంచే కార్యకలాపాలను కొనసాగించాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాల తరువాత.. మకాం మార్పు
ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే- జగన్ తన మకాంను హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి తాడేపల్లి నివాసానికి మార్చబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని అన్నారు. కిందటి నెల 11వ తేదీన ఎన్నికలు ముగిసిన తరువాత జగన్.. కాస్త విశ్రాంతి తీసుకున్నారు. దీనికోసం ఆయన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లొచ్చారు. ఫలితాలు వెలువడిన తరువాత తన కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే నిర్వహించేలా ప్రణాళిక వేసుకున్నారు.
తొలి వైసీపీఎల్పీ భేటీ అక్కడే..
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు లేదా మరుసటి రోజు వైఎస్ జగన్.. శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి భేటీని తాడేపల్లి నివాసంలోనే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. ఈ దిశగా ఆయన జగన్ ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని అంటూ దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, తాము అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా అదేనా!
పార్టీ నాయకులు చెబుతున్నట్టుగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం- తాడేపల్లి నివాసాన్ని అధికారిక నివాసంగా మార్పు చేయవచ్చని చెబుతున్నారు. క్యాంప్ కార్యాలయంగా మార్పులు చేర్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ ప్రజలను కలుసుకోవడానికి వీలుగా- తాడేపల్లి నివాస ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం అంటూ ఏదీ లేదు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ప్రభుత్వం మారటం అంటూ జరిగితే- చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ- తాడేపల్లిలోని ఇంటి నుంచే వైఎస్ జగన్ పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నద్ధమౌతున్నారు.