జగన్ పట్ల పాజిటివ్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: టీడీపీకి కౌంటర్?,‘తిరుపతి’ కోసం సోము భేటీ
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల దాడులపై స్పందిస్తూ.. వైఎస్ జగన్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ మండిపడుతున్నారు.
వైఎస్ జగన్ ఏపీకి సీఎం అంటూ పవన్ కళ్యాణ్..
కాగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆలయాలపై దాడులను ఖండిస్తూ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అయితే, టీడీపీ నేతలకు భిన్నంగా ఆయన విమర్శలుండటం గమనార్హం . వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాము క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా చూడబోమని, ముఖ్యమంత్రిగానే, నాయకుడిగానే చూస్తామని పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు. అంతేగాక, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ ముఖ్యమంత్రి అనడం సరికాదని హితవు పలికారు.
టీడీపీ, బీజేపీలకు షాకిచ్చేలా పవన్ వ్యాఖ్యలు
కులాలు, మతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని జనసేన భావిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం పలానా మతం, ఇంకొకరు మరొక మతం అంటూ మతాల గురించి తాను మాట్లాడబోనన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అటు టీడీపీ నేతలతోపాటు బీజేపీ నేతలను కూడా ఇబ్బంది పెట్టేవిగా కనిపిస్తుండటం గమనార్హం.
జనసేన కార్యకర్త కుటుంబానికి రూ. 8.5లక్షల సాయం
ఇది ఇలావుండగా, తూర్పుగోదావరి జిల్లా తునిలోని కొత్తపాకలలో దివీస్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినవారు జైలు నుంచి విడుదల కావడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. 36 మందిని జైల్లో పెట్టడం గ్రామస్తుల్లో భయాందోళనలకు కారణమైందని, జైలుపాలైనవారందరికీ బెయిల్ రావడానికి సహకరించిన సీఎం జగన్, హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలన్నారు.
పవన్ కళ్యాణ్తో సోము వీర్రాజు భేటీ.. తిరుపతి బైపోల్ 2024కి నాంది..
మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి, ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఉభయ పార్టీల అభ్యర్థిగా బరిలో దిగుతామన్నారు. బీజేపీ నా.. జనసేన నుంచి అభ్యర్థి పోటీలో ఉంటారా? అనేది తమకు ముఖ్యం కాదని, ఉభయ పార్టీల అభ్యర్థి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యమని అన్నారు. ఇందుకు తిరుపతి ఉపఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని సోము చెప్పారు. ఇరుపార్టీల్లో ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చింామని, కుల, మత, వర్గ బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పనిచేస్తామన్నారు సోము వీర్రాజు.