వేదాంతం చెప్పిన అపరిచితుడు, అమ్మో.. జగన్: దాడి
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని, ఆయన మంచి నటుడు అని, అపరిచితుడని దాడి వీరభద్ర రావు బుధవారం ఏకిపారేశారు. ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను చూసి ఓటేయాలనే అతి విశ్వాసం జగన్ది అన్నారు.
తాను ఊహించిన జగన్ వేరు.. జైలులో చూసిన జగన్ వేరని గతంలో చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని... జైలులో చూసిన జగన్ వేరు, ఇప్పుడు చూస్తున్న జగన్ వేరన్నారు. పార్టీని నడిపే శక్తి లేదని జగనే నిరూపించుకున్నారన్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసి పార్టీ నడుస్తుందా అని అడుగుతున్నారని, వారితో మాట్లాడకుంటే ఎలా అని అభిప్రాయపడ్డారు.
పార్టీలో ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మనసులో ఒకటి.. బయట ఒకటి అన్నారు. ఆయన మెంటాలిటీని ప్రజలు భరించలేరని, అది తెలుసుకునే సరికి తమకు ఆలస్యమైందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయన తీరును గమనించి తిరస్కరించారన్నారు.
పార్టీలో ఆయనే వన్ మాన్ ఆర్మీ అన్నారు. ఆయనను చూసే ప్రజలు ఓటేయాలనే అతివిశ్వాసమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి కార్యకర్తలు, అభ్యర్థులు, నాయకులు కారణం కాదన్నారు. జగనే కారణమన్నారు. జగన్ విశ్వరూపం చూసి ప్రజలు అమ్మో జగన్ అనుకున్నారన్నారు. జైలులో ఆయనను కలిసినప్పుడు వేదాంతం వల్లించారని, అప్పుడు తాను నిజమే... యువరత్నం వస్తుందని భావించానని, అయితే అప్పటి జగన్ వేరన్నారు.