జగన్! మరి ఇదేమిటీ?: టీడీపీ నుంచి వస్తూ ఆ కీలక నేతలు వైసీపీని చిక్కుల్లోకి నెట్టారా?
అమరావతి: ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనానని వెంట నడవగా, ఆమంచి కృష్ణమోహన్, మేడా మల్లికార్జున్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు జగన్ పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం సహజమే. పార్టీని వీడే సమయంలో ఆయా పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ వెళ్లే వారు ఎక్కువ.
మీరు మాకొద్దు!: కీలక నేతలకు పవన్ కళ్యాణ్ డోర్లు క్లోజ్? ప్రజారాజ్యంలో ఏం జరిగిందంటే?
అధికార పార్టీ నుంచి విపక్షంలోకి..
గత కొద్ది రోజులుగా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్న వారు చంద్రబాబుపై, టీడీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ నేతలు చేస్తున్న విమర్శలు జగన్కు కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. టిక్కెట్లు దక్కవనే అసంతృప్తితోనో లేక మరో కారణంతో పార్టీలు వీడటం వరకు పర్వాలేదు కానీ... నాలుగున్నరేళ్ల పాటు అధికార పార్టీలో ఉండి ఎన్నికలకు రెండు నెలల ముందు.. టీడీపీ ఏమీ చేయలేదని చెప్పడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విపక్షం నుంచి అధికార పార్టీలో చేరి విమర్శలు చేయడం వేరని, కానీ ఇన్నాళ్లు అధికారం అనుభవించి, విపక్ష పార్టీలో చేరుతూ.. ఇన్నాళ్లు ఏంచేయలేదని చెప్పడం సరికాదని గుర్తుచేస్తున్నారు. మరో విషయం ఏమంటే, ఎన్నికలకు రెండు నెలల ముందు.. తాము అధికార పార్టీని వీడి విపక్షంలో చేరుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.
ఇక్కడే జగన్కు రివర్స్
విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కోసం తాము నాలుగేళ్ల పాటు ఎదురుచూశామని, ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి హామీల అమలు గురించి ప్రశ్నించామని చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, నాలుగేళ్ళ పాటు బీజేపీతో సంసారం చేసి, ఎన్నికలు వస్తున్నాయని ఇలా చేస్తున్నారని జగన్ అంటున్నారు. అయితే తాము వేచి చూశామని, హామీలు నెరవేర్చకపోయే సరికి బయటకు వచ్చామని టీడీపీ చెబుతోంది.
జగన్! మరి దీనిని ఏమంటారో?
ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీని వీడటం టీడీపీది రాజకీయ స్టంట్ అయితే, టీడీపీ నుంచి రెండు నెలల ముందు వైసీపీలో చేరుతూ... చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగేళ్లు ఏమీ చేయలేదని చెప్పడాన్ని ఏమంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీలు మారడం సహజమేనని, కానీ ఈ నాలుగున్నరేళ్లు టీడీపీలో ఇబ్బందులు పడ్డామని, ఏపీకి టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, ప్రత్యేక హోదా వంటి అంశాలపై చంద్రబాబు అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని ఇప్పుడు చెప్పడం ఏమిటని అడుగుతున్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ, చంద్రబాబు తప్పు చేస్తున్నారని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇప్పుడు వైసీపీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందని చెబుతున్నారు. వేచి చూశామనే సమాధానం చెబితే మాత్రం అది మభ్యపెట్టడమే అవుతుందని అంటున్నారు. మామూలుగా వెళ్తే ఈ ప్రశ్న తలెత్తకపోయేదని, కానీ వెళ్తూ వెళ్తూ నాలుగేళ్ల పాటు భరించామని, ఏమీ చేయలేదని చెప్పడం జగన్కు రివర్స్ అవుతోందని అంటున్నారు.