'నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత జగన్ పరిస్థితి ఇది, అజ్ఞాతంలోకి'
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పరిస్థితి గందరగోళంగా తయారయిందని టిడిపి ఎద్దేవా చేసింది.
విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పరిస్థితి గందరగోళంగా తయారయిందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం నాడు ఎద్దేవా చేశారు.
నోట్ల రద్దు అనంతరం జగన్ అడ్రస్ గల్లంతైందన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న అక్రమ సంపాదనను ఎలా మార్చుకోవాలో తెలియక జగన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు.
'నోట్ల రద్దుపై జగన్ ఎందుకు నోరు విప్పట్లేదు, ఆ జిమ్మిక్కులు విజయ సాయికే తెలుసు'
అక్రమ సంపాదనలో ఆరితేరిన జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక అర్హత, హక్కు లేదన్నారు. నోట్ల రద్దు వ్యవహారంపై జగన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.
పోలవరం పూర్తి చేస్తాం: దేవినేని
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడి కాల్వను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్తో కలసి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద వారానికి 14 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాల్సి ఉండగా 12 లక్షల వరకు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఈ ఖరీఫ్లో 45 టీఎంసీల నీరును ఎత్తిపోశామన్నారు. 10.74 లక్షల ఎకరాల పంటపొలాలతో పాటు లక్షా 50 వేల ఎకరాల చేపల చెరువులకు సాగునీరు అందించామన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు కల అయిన తెలుగుగంగను 2017 నాటికి పూర్తి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రెండున్నరేళ్లలో రూ.19వేల కోట్లు ఖర్చు చేశామని, ఈ మొత్తంలో రూ.2వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకే వినియోగించామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల స్ఫూర్తితో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.