నోట్ల రద్దు: 'జగన్ సభలకు ఎలా ఖర్చు పెడుతున్నారు', వైయస్సే.. రాజప్ప షాకింగ్
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన నేలమాళిగల్లో దాచి పెట్టిన నల్ల ధనాన్ని జనాలకు పంచి పెట్టాలని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు బుధవారం నాడు డిమాండ్ చేశారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన నేలమాళిగల్లో దాచి పెట్టిన నల్ల ధనాన్ని జనాలకు పంచి పెట్టాలని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు బుధవారం నాడు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ దివిస్ పరిశ్రమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఉపాధి అవకాశాలకు జగన్ గండికొడుతున్నారన్నారు.
అస్మదీయుల ఫార్మా కంపెనీలను జగన్ ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలన్నారు. రాంకీ ఫార్మా ముందు జగన్ ఎందుకు ధర్నా చేయడం లేదన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే, జగన్ మాత్రం అంత ఖర్చు పెట్టి సభలు ఎలా పెడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.
జగన్ చిచ్చు పెడుతున్నారు: చినరాజప్ప
అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు. దివిస్కు కేటాయించిన భూములు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతుల నుంచి లాక్కున్నారన్నారు. తాము అదనపు పరిహారంతో రైతులకు న్యాయం చేశామన్నారు. జగన్ డమ్మీ కంపెనీల్లా హెరిటేజ్లో అక్రమాలు లేవని, హెరిటేజ్ లావాదేవీలు అన్నీ చట్ట పరిధిలో జరుగుతున్నాయన్నారు.