విశాఖలో దాడి: హైదరాబాద్లోని ఆస్పత్రిలోనే జగన్, నిలకడగానే ఆరోగ్యం
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖలో ఆయనపై దాడి జరిగిన తర్వాత ప్రథమ చికిత్స తీసుకున్న జగన్ వెంటనే విమానంలో హైదరాబాద్ బయలుదేరారు.
జగన్ శంషాబాద్ చేరుకోగానే అపోలో వైద్యులు ఆయన గాయాన్ని పరిశీలించారు. అనంతరం జగన్ కట్టుదిట్టమైన భద్రత నడుమ అక్కడి నుంచి లోటస్ నివాసానికి వెళ్లిపోయారు.
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
ఆ తర్వాత కొద్దిసేపటికి సతీమణి వైయస్ భారతితో కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిటీ న్యూరో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. జగన్ భుజానికి వైద్యులు మూడు కుట్లు వేశారు. చికిత్స అనంతరం ఆయన తిరిగి నివాసానికి చేరుకోనున్నారు. కాగా, ఆస్పత్రి వద్దకు భారీగా జగన్ అభిమానులు చేరుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
జగన్పై దాడి: గవర్నర్ ఆరా, తేలుస్తామని చినరాజప్ప, డీజీపీ ఏమన్నారంటే?, విశాఖలో ఉద్రిక్తత
జగన్ ఆరోగ్యం నిలకడగానే..
ఎడమ భుజానికి 8-9 కుట్లు వేశామని ఆస్పత్రి వైద్యుడు జ్ఞానేశ్వర్ తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు. పందేం కోళ్లకు కట్టే కత్తి కావడంతో విషప్రయోగమేమైనా జరిగిందా అనే అనుమానంతో గాయమైన ప్రాంతంలో కొంత భాగాన్ని తీసేసి పరీక్షలకు పంపామని చెప్పారు. రక్త నమూనాలు కూడా సేకరించామని చెప్పారు. దేవుడి దయ వల్ల బాగా లోతుకు గాయం కాకపోవడంతో జగన్ తొందరగానే కోలుకుంటారని చెప్పారు. అబ్జర్వేషన్ కోసం ఆస్పత్రిలోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు వైద్యుడు తెలిపారు.
పబ్లిసిటీ కోసమంటారా?
విమానాశ్రయంలో జగన్పై దాడి జరిగితే పబ్లిసిటీ కోసమని డీజీపీ వ్యాఖ్యానించడం దారుణమని వైసీపీ సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర పోలీసులే అడ్డుకున్నారని చెప్పారు. దాడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జగన్కు వస్తున్న ఆదరణ చూసే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, జగన్ను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.